Podu lands | అడవిబిడ్డల బతుకులకు బీఆర్ఎస్ సర్కారు పాలనలో భరోసా వచ్చింది. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములు ఇక వారికే దక్కనున్నాయి. పోడు భూములకు పట్టాల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానుండగా, మానుకోట జిల్లా వేదికగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు పోడు భూముల పట్టాలను అర్హులకు అందించనున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్తో కలిసి మహబూబాబాద్లో పర్యటించనున్న ఆయన, జిల్లాలోని 25,254 మందికి 71,797 ఎకరాలకుగాను హక్కు పత్రాలను పంచనున్నారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం దొరికి తమ కల నెరవేరే తరుణం రావడంతో లబ్ధిదారులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
– వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నో ఏండ్లుగా అడవిని పోడు చేసుకొని సాగు చేసుకుంటూ గిరిజనులు, గిరిజనేతరులు జీవనం గడుపుతున్నారు. తాము దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూమికి పట్టాలు ఇవ్వాలని సమైక్య రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయారు. వానకాలం ఆరంభమైందంటే చాలు సాగు చేసుకుందామని పోడు భూమిలోకి పోతే అటవీ, పోలీస్ అధికారులు తరచూ అడ్డుకొని కొందరిపై కేసులు కూడా పెట్టారు. ఎన్నో ఏండ్లుగా పోడు చేసుకొని పంట పండించుకుంటున్న భూములు తమకు దక్కుతాయనే ఆశ వారికి ఏమాత్రం ఉండకపోయేది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పోడుదారుల కష్టాలను తీర్చాలని సంకల్పించి అర్హులైన పోడుదారులందరికీ, ముఖ్యంగా అటవీ భూమిని పోడు చేసుకొని సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులను స్వీకరించి ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసింది. నేడు పోడు భూములకు పట్టాలను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో గిరిజన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
జయశంకర్ జిల్లాలో పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్హౌస్లో పోడు పట్టాలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా అర్హులకు అందజేయనున్నారు. జిల్లాలో 3,215 మందిని ప్రభు త్వం అర్హులుగా గుర్తించింది. వీరికి సుమారు 8వేల ఎకరాలకు సంబంధించిన పట్టాలను అందించనున్నారు. పట్టాలు అందిన వెంటనే ‘రైతుబంధు’ సాయం కూడా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. భూముల వివరాలను ‘ధరణి’లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది.
మహబూబాబాద్ జిల్లాలో 25,254 మందికి 71,797 ఎకరాలకు గాను పట్టాలను మంత్రి కేటీఆర్ నేడు పంపిణీ చేయనున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గార్ల, బయ్యారం, కొత్తగూడ, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు, కురవి, మహబుబాబాద్, గం గారం మండలాల్లోని 154 గిరిజన పంచాయతీల్లో ఉన్న 344 గ్రామాల్లో పోడు భూములు విస్తరించి ఉన్నాయి. అర్హులైన పోడు రైతులను గుర్తించేందుకు అధికారులు సుదీర్ఘ కసరత్తు చేసి చివరికి ఎంపిక చేశారు. గత ప్రభుత్వాల హయాం లో పోడు భూముల పంపిణీ సరైన పద్ధతిలో జరగకపోవడంతో అర్హులకు అన్యా యం జరిగింది. దీంతోపాటు అటవీభూములు ఆక్రమణకు గురయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాల పంపిణీ కోసం ‘పాటిగన్ టెక్నాలజీ’ని వినియోగించింది. సర్వే నంబర్, విస్తీర్ణం, భూమి ఏ అక్షాంశం, రేఖాంశంల మధ్య ఉన్నది? అనే వాటితో పాటు భూ మి పూర్తి వివరాలను గూగుల్ మ్యాప్లో పొందుపరిచారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. మళ్లీ పోడు చేయకుండా ప్రభు త్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ఏండ్ల నాటి కష్టాలు దూరమైతానయ్
చిట్యాల: నా పేరు కొత్తపెల్లి భూమమ్మ. మాకు వెంచరామి గ్రామ శివార్ల రెండున్నర ఎకరాల పోడు భూమి ఉన్నది. మొన్న అధికార్లు వచ్చి సర్వే చేసిం డ్లు. నిజమైన గిరిజన రైతులను గుర్తించి గ్రామపంచాయతీల తీర్మానం చేసిండ్లు. ఇప్పుడు నా భూమికి పట్టా వస్తాందంటె నమ్మ బుద్ధి కావట్లే. రైతుబంధు సుత ఇస్తరట. ఇంత కంటే సంతోషం ఏముంది. వర్షాకాలంల పత్తి వేసేది. ఇప్పుడు రైతుబంధు పైసలొస్తె అనుకున్న పంట పండిస్త. ఇగ మాకు ఏండ్ల సందినుంచి కష్టాలు దూరమైతానయ్. శాన ఏళ్ల నుంచి ఎవ్వలు పట్టించుకోలే. బతుకుదెరువు కోసం పోడు భూములను నమ్ముకున్నం. వాటికి సీఎం కేసీఆర్ పట్టాలను అందజేస్తున్నడంటే మస్తు సంతోషమైతాంది. గిరిజనుల గోడును అర్థం చేసుకున్న సర్కారు వెంటే ఉంటం.
– కొత్తపెల్లి భూమమ్మ, రైతు, వెంచరామి(చిట్యాల)
సర్కారు మేలు మర్చిపోం
సర్కారు పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తుండడం శాన సంతోషం. ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా పట్టా పుస్తకాలు లేక మస్తు ఇబ్బందులు పడ్డం. రైతుబంధు, రైతు బీమా వంటివి వర్తించకపోవడంతో బాగ నష్టపోయినం. పంట పెట్టబడికి సైతం కష్టంగ ఉండేది. పట్టాలు వస్తే అన్ని దూరమైతయ్. పోడు భూములకు పట్టాలిస్తున్న సర్కారు మేలు మర్చిపోం.
– వజ్జా పద్మ, గౌరారం(బయ్యారం)
కలలో కూడా ఉహించలే..
పలిమెల: ఎన్నో ఎండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇత్తరని అని కలల కూడా అనుకోలే. మా అయ్యవ్వల కాలం నుండి భూమి ని దున్నుకొని కుటుంబాన్ని సాదుకుంటానం. నా కు బూర్గుగూడెం అటవీ ప్రాంతంలో నాలుగు ఎకరాల పోడు భూమి ఉంది. ప్రతి ఏడు అన కాలం దున్నుతున్నప్పుడు ఫారెస్టువాళ్లు వచ్చి శాన ఇబ్బందులు పెడుతుండే. మా గ్రామనికి పెద్ద సార్లు అచ్చినప్పుడు గోస చెప్పుకుంట ఏడ్చేటోళ్లం. ఐనా మా బాధలు ఎవ్వలు తీర్చలే. సీఎం కేసీఆర్ అన్న మాట తప్పకుండా పోడు భూములకు సర్వే చేసి పట్టాలిత్తుండు.
– మట్టి సమ్మయ్య