కురవి, జూలై 2 : ప్రగతిని పొగడడం.. అభివృద్ధిని ప్రోత్సహించడం… ఆపదలో ఉన్నానంటే స్పందించడం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు చెల్లుతుంది. నిత్యం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తుంటారు. బీఆర్ఎస్ పుణ్యమా అని మహబూబాబాద్ జిల్లా అవతరించిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారనేది అక్షర సత్యం. అన్ని జిల్లాలతో పోలిస్తే గిరిజనులు అత్యధిక శాతం ఉండి, వెనుకబడిన ఈ నూతన జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
ట్విట్టర్ వేదికగా మహబూబాబాద్ జిల్లా కారంపొడి ఉత్పత్తిలో నంబర్వన్ స్థాయికి చేరుకుందని ఆదివారం ట్వీట్ చేయడంతో జిల్లా మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మిర్చి సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ పండే తేజ రకానికి ఎంతో డిమాండ్ ఉంది. స్వదేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి అయ్యే మేలు రకం పంట ఇక్కడ పండుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో కురవి, మరిపెడ మండలాల్లో రెండు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. నాటి నుంచి రైతులు మిర్చి వేసేందుకు ముందుకు వస్తున్నారు. 2022-23 సంవత్సరంలో 80వేల ఎకరాలు సాగు చేసిన మిర్చి ప్రస్తుతం లక్ష ఎకరాలను అధిగమించవచ్చని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడంతో మిర్చి సాగు విరివిగా పెరిగింది. ముఖ్యంగా రైతులకు నికర ఆదాయంతోపాటు ఖర్చులు మిగులుతున్నాయి. క్వింటాకు రూ.1600 కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో మిర్చి సాగులో జిల్లా మరింత ముందుకు పోతుందని అధికారులు, రైతులు అంటున్నారు.