భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉందని, ఈ కారణంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించాలని కోరుతూ ఆదివారం కేటీఆర్ భద్రాచలం పట్టణంలో రోడ్షో నిర్వహించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే యాదాద్రి తరహాలో భద్రాద్రి ఆలయాన్ని సకల హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. గోదావరి వరద ముప్పు తప్పించేందుకు కరకట్ట నిర్మిస్తామన్నారు. నియోజకవర్గంలో 16వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఖమ్మం, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తమ కుటుంబం కంటే గొప్ప రామభక్తులు రాష్ట్రంలో ఎవరూ లేరని, తన పేరులోనే రాముడు ఉన్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థులు తెల్లం వెంకట్రావు, బానోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వర్రావు, వనమా వెంకటేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఆదివారం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. తొలుత భద్రాచలం పట్టణంలో రోడ్ షో నిర్వహించి ప్రధాన సెంటర్లో మాట్లాడారు. భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉన్నదని స్పష్టం చేశారు. ఈ కారణంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారని గుర్తుచేశారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే యాదాద్రి తరహాలో భద్రాద్రి ఆలయాన్ని సకల హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. భద్రాచలం వాసులకు గోదావరి వరద ముప్పు తప్పించేందుకు కరకట్ట నిర్మిస్తామన్నారు. ఇక్కడ ప్రజల ప్రతి సమస్య తనకు తెలుసునన్నారు. భద్రాద్రి రాముడిపై తమ కుటుంబానికి అపార విశ్వాసం ఉందని, ఆయన ఆశీస్సులు తమ పార్టీకి ఉంటాయన్నారు. కొందరు పనిగట్టుకుని మరీ భద్రాచలంపై తమ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకపోయినా అభివృద్ధి విషయంలో రాజీ పడలేదన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భద్రాచలం నియోజకవర్గంలో 16వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గిరిజనేతరులకూ పోడు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతుందని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ల ను ఎన్నికల్లో ఓడించి సాగనంపితేనే గిరిజనేతరులకు పోడు పట్టాల పంపిణీ సాధ్యమవుతుందన్నా రు. సీతమ్మసాగర్ పనులు సాగకపోవడానికి కారణం, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ నేతలే కారణమని నిప్పులు చెరిగారు. వారు కేసులు వేయడంతోనే ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగడం లేదన్నారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రజల బతుకులను మార్చలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి మేలూ చేయదన్నారు. ప్రజలు వాళ్ల మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. ఇప్పటికే కాంగ్రెసోళ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డబ్బు సంచులతో తిరుగుతున్నారని, అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్ షోలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ప్రభు త్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పాల్గొన్నారు.