వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 31 : ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్, ఉన్నతాధికారులు, విభాగాధిపతులతో కలిసి ఆదివారం ఆమె సమీక్షించారు. ఎంజీఎంలో కరోనా బాధితులకు, ఇతర విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న సేవలు తెలుసుకున్నారు. సేవలు మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన నిధులు, నియామకాల వివరాలు, యంత్ర పరికరాలపై పూర్తి నివేదికను సిద్ధం చేయాలని, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి విన్నవిస్తానని చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం కొవిడ్ వార్డులో ఏడుగురు చికిత్స పొందుతున్నారని, వారిలో నలుగురు చిన్నారులు కాగా, ముగ్గురు వృద్ధులని తెలిపారు. ఇప్పటివరకు కొవిడ్ మరణాలు సంభవించలేదని, ఆక్సీజన్ అందించే అవసరం కూడా రాలేదని చెప్పారు. పరీక్షలు నిర్వహించే సిబ్బంది, కిట్స్ కొంత కొరత ఉన్నందున వాటిని త్వరలో సమకూర్చేలా చూస్తామన్నారు. అలాగే విద్యుత్ పర్యవేక్షణ కోసం ఇంజినీరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, జనరేటర్ల వినియోగంలో ఏర్పడుతున్న చమురు సమస్యను అధిగమించేందుకు కలెక్టర్తో మాట్లాడి కోటా పెంపు కోరతామన్నారు.
ఎంజీఎంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అద్దె దుకాణాలను తొలగిస్తామని అన్నారు. టీఎస్ ఎంఎస్ఐడీసీ ద్వారా చేపడుతున్న పనుల బిల్లులు నిలిచిపోవడంతో పనుల్లో ఆటంకం కలుగుతున్నదని త్వరలో వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఎంజీఎంలో ఉన్న 14 ఆపరేషన్ థియేటర్లలో మూడు వినియోగానికి వీలు లేవని వాటిపై ఉన్నతాధికారులకు నివేదించినట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా మరమ్మతులు చేపట్టి ఇతరత్రా అవసరాలకు వాడాలని సూచించారు. వైద్యుల హాజరు విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, వైద్యసేవలకు ఆటంకం కలిగించే అంశాలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అన్నారు. పేషెంట్లకు అందించే ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాలపై ప్రత్యేక నిఘా ఉండాలన్నారు. ఎంజీఎం ఆవరణలో పచ్చదనం పెంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్వరలో హెచ్డీసీ(హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ) మీటింగ్ ఏర్పాటుచేసి ఆదాయం పెంచేలా సైతం చర్యలు చేపడతామని, అందులో భాగంగా ప్రధాన రహదారి వైపు షెటర్లు నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి పొందుతామని చెప్పారు.
ఐనవోలు : భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలా ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర దేవాదా య, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఐనవోలులో ఆదివారం ఆమె జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ముందుగా ఆలయానికి వచ్చిన మంత్రికి ఈవో నాగేశ్వర్రావు, అర్చక బృందం పూర్ణకుంభ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి సురేఖ.. స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమీక్షలో పాల్గొన్నారు. కొమురవెల్లి, ఐనవోలు, సమ్మక్క-సారలమ్మ జాతరల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఘనంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతర కోసం ఆర్డీవో రమేశ్ను ప్రత్యేకాధికారిగా నియమించినట్లు చెప్పా రు. భక్తుల సౌకర్యార్థం వీలైనన్ని ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అత్యవసర సేవల కోసం మూడు అంబులెన్స్లు ఆలయ ప్రాంగణంలో ఉండాలన్నారు. గర్భిణు లు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆల యం చుట్టుపక్కల బెల్ట్షాపులను నిరోధించాలని కోరారు. తాత్కాలిక రోడ్లు, టాయిలెట్లు, డ్రెస్సింగ్ రూములు, హైమా స్ట్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంకర్ల ద్వారా వాటర్ తెప్పించి ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. జాతరలో ప్లాస్టిక్ బ్యాగులకు బదులు కాగితపు సంచులు వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ రాధికా గుప్తా, డీసీ శ్రీకాంత్రావు, డీసీపీ రవీందర్, ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు, సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన పాల్గొన్నారు.