హనుమకొండ చౌరస్తా, మే 30 : పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్) ఆవరణలో డయాగ్నొస్టిక్స్ కేంద్రాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం కోసం వెళితే వైద్యులు వివిధ రకాల టెస్టులు రాయడంతో సమీపంలోని ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు వెళ్లి రూ.వేలు చెల్లించేవారు. కొంతమంది ల్యాబ్ పరీక్షలు చేయించుకోలేక అనేక అవస్థలు పడేవారు. పేదల ఇబ్బందులు గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం జిల్లా డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పేదలకు ఉచితంగా ప్రాథమిక రోగనిర్ధారణ పరీక్షలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు రక్త, మూత్ర పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుండగా కొత్తగా ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు, రేడియోలజీ తదితర పరీక్షలు కూడా అందుబాటులోకి తెచ్చింది.
పేదలకు ఉచిత వైద్య పరీక్షలు
ఒక రోగికి ఒక పరీక్ష సూచిస్తే ఆ రోగి ఎంజీఎం దవాఖాన లేదా ప్రైవేట్ డయాగ్నొస్టిక్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటుతో అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, రేడియోలజీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ డయాగ్నొస్టిక్స్ సెంటర్ అందుబాటులోకి వస్తే ఉచితంగా సుమారు 50 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అత్యాధునిక పరికరాలతో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు వైద్యులు, ఏడుగురు ల్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని వైద్యశాఖ ఆధ్వర్యంలో నియమించారు.
నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్) ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్ను బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో టీ-డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని సందర్శించారు. సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్ఎంవో సారంగంతో కలిసి కేంద్రాన్ని పరిశీలించి, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పరికరాలను పరిశీలించి, వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఉచిత వైద్యపరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీ-డయాగ్నొస్టిక్స్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.