సర్కారు స్కూళ్లలో ఢిల్లీ తరహాలో సకల సౌకర్యాలు కల్పించి సరికొత్తగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్స్లో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని 86 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఎర్రబెల్లి అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు. తాను కూడా సర్కారు బడిలోనే చదువుకున్నానని, విద్యార్థులు తమ గురువులు చూపిన బాటలో నడవాలని సూచించారు. అలాగే ప్రతిభావంతులైన ఉపాధ్యాయులున్న జనగామ జిల్లా వచ్చే ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో నంబర్ వన్గా నిలువాలని ఆకాంక్షించారు.
జనగామ, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో ప్రైవేట్కు దీటుగా పోటీపడుతున్న సర్కారు స్కూళ్ల తరహాలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు రూ.7వేల కోట్లు ఖర్చుచేసి వచ్చే ఏడాది నాటికి సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధ్యక్షతన నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 86మంది ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, స్టేషన్ఘన్పూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జ రాజుతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపర్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. ఢిల్లీ వెళ్లి అక్కడ విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణలో సర్కారు స్కూళ్లను ఇదే మాదిరిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారని చెప్పారు. అందులో భాగంగా ఒక్కో పాఠశాలకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు కేటాయించి వచ్చే విద్యా సంవత్సరం వరకు అబ్బురపడేలా రూపురేఖలు మారుస్తామని చెప్పారు. పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాల్లో కొత్తగా ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి దయాకర్రావు ప్రకటించారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల్లో మౌలిక వసతులకు పెద్దఎత్తున నిధులు కేటాయించిందని వివరించారు. జిల్లాకేంద్రంలో రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం కాబోతుందని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని ఎర్రబెల్లి వెల్లడించారు. అత్యధిక విద్యార్హతలు, సబ్జెక్టులో నిష్ణాతులైన ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్న జనగామ జిల్లా వచ్చే ఏడాది పదో తరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలువాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.
సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకోవాలి
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా తన ప్రతిభాపాటవాలతో ఎదిగి భారత తొలి ఉప రాష్ట్రపతి పదవిని అధిరోహించారని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పెద్దలు చూపిన మార్గంలో పయనిస్తున్న తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఏర్పాటైన జనగామ జిల్లా కొద్ది కాలంలోనే అభివృద్ధిలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య పట్టుబట్టి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటున్నారని చెప్పారు. తాను కూడా 4, 5 తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివానని, 6వ తరగతి ఏవీబీలో, ఇంటర్ ఎల్పీకాలేజీలో చదువుకున్నానని గుర్తు చేశారు. మీ బోధన ప్రతి మనిషిలో గుర్తుంటుందని అప్పటి గురువులు సూర్యనారాయణ, రంగారావు మాస్టర్లను ఇప్పటికీ కలుస్తుంటానని ఎర్రబెల్లి అన్నారు.
గురువులను మరిచిపోను : రాజయ్య
పశువుల కాపరిగా ఉన్న తనను తల్లిదండ్రులకు పాఠశాలకు పంపిస్తే విద్యాబుద్ధులు నేర్పించి ఇంతటివాన్ని కావడానికి కృషి చేసిన గురువులను మరిచిపోనని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనన్నారు. సమాజంలో వెలుగులు నింపే భూమిక పోషిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము, రైస్మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.