వరంగల్, డిసెంబర్ 28(నమస్తేతెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చి సర్పంచ్ల అధికారాలు, నిధులను తగ్గించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గతంలో ఇచ్చే గ్రాంట్ను కూడా కేంద్రం తగ్గించిందని తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన బుధవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు బీ గోపి, రాజీవ్గాంధీ హన్మంతుతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ మల్లేశం హత్యపై సమావేశం సంతాపం ప్రకటించింది.
మల్లేశం హత్యను తీవ్రంగా ఖండించింది. రెండు నిమిషాలు మౌనం పాటించారు. స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు, గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి రూ.1,830 కోట్ల గ్రాంట్ ఇచ్చేదని, ఈ ఏడాది రూ.500 కోట్లు తగ్గించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఒక్క రూపాయి ఇవ్వలేదని, అయినా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా రూ.256 కోట్లు విడుదల చేస్తున్నదని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాక సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏటా జీపీలకు రూ.330 కోట్లు విడుదల చేస్తే అందులో రాష్ట్ర వాటా యాభై శాతమైతే కేంద్రం వాటా యాభై శాతమని తెలిపారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తండాలు, గూడేలు, శివారు పల్లెలనూ గ్రామ పంచాయతీలుగా చేసి ప్రతి జీపీకి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు. పారిశుధ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ ఇచ్చిందని, ట్రాక్టర్ భారం కాదని ఆదాయ మార్గమన్నారు.
హరితహారంలో నాటిన మొక్కలకు గతంలో నీరు అందించాలంటే ప్రతి ట్యాంకర్కు రూ.6 వేల చొప్పున అద్దె చెల్లించాల్సి వచ్చేదని, రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్ను సమకూర్చిన తర్వాత ఇప్పుడు అద్దె డబ్బులు మిగులుతున్నాయని పేర్కొన్నారు. తెలివిగా పనిచేస్తే సర్పంచ్లకు పంచాయతీల్లో మస్తు ఆదాయం వస్తుందని, తడిపొడి చెత్తతో ఎరువు తయారు చేసి రూ.50 లక్షలు పోగు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆదాయం పెంచిందని, దేశం మొత్తంలో 19 అవార్డులు వస్తే అందులో తెలంగాణకు 18 వచ్చాయని మంత్రి గుర్తుచేశారు. గతంలో సర్పంచ్ల వేతనం రూ.వెయ్యి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,500కు పెంచిందని, జడ్పీటీసీలకు గతంలో రూ.2,250 ఉంటే ఇపుడు రూ.13 వేలు ఇస్తున్నామని తెలిపారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు ఎక్కడా ఇవ్వనన్ని డబ్బులు ఇస్తున్నామని, ఇంకా పెంచుతామని ప్రకటించారు. సర్పంచ్లను బీజేపీ పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని, తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. కేంద్రం ఇచ్చే గ్రాంట్కు సమానంగా నిధులు ఇస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని, దేశంలోని మరే రాష్ట్రం ఇవ్వడం లేదని చెప్పారు. హత్యకు గురైన మల్లేశం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరుతున్నట్లు పంట నష్టపోయిన రైతులకు ఎక్కువ నష్ట పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. రోడ్ల కోసం సీఎం కేసీఆర్ రూ.1,800 కోట్లు ఇచ్చారని, సరిపోవంటే అదనంగా మరో రూ.500 కోట్లు ఇచ్చారని, రోడ్లు ఎక్కువగా ధ్వంసమైన నర్సంపేట, భూపాలపల్లి, ఇతర నియోజకవర్గాల్లో ఖర్చు చేస్తామని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా ఒక్క వరంగల్ జిల్లాలోనే ఈ ఏడాది తొలి విడుత 2.84 లక్షల మందికి రూ.266 కోట్లు ఇచ్చిందని చెప్పారు. రైతుబీమా రూ.5 లక్షలు ఇస్తున్నది కూడా దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. మరే రాష్ట్రంలో లేని విధంగా ఆసరా పింఛన్ రూ.2,016, కల్యాణలక్ష్మి పథకం నుంచి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,00,116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఆయిల్పామ్ సాగులో రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ ముందు ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, నిధుల వివరాలతో బోర్డులు పెట్టాలని సూచించారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. గత జనవరిలో వడగళ్ల వానతో నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన పంట నష్టానికి జీవో నంబర్ 42 ద్వారా బాధిత రైతులకు సాయంతో పాటు రుణాల రీషెడ్యూల్, కొత్త రుణాల సదుపాయం కల్పించేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట రైతాంగానికి మోటర్లు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను కూడా అందించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీవో సంపత్రావు, డీఏవో ఉషాదయాళ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
నిందితులకు శిక్షపడాలి : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత కక్షలతో చేర్యాల జడ్పీటీసీ మల్లేశం హత్య జరిగిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిపై దాడి అంటేనే భయపడేలా చర్యలు ఉండాలన్నారు. మల్లేశం హత్య ఉదంతాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసకోవాలని మంత్రి ఎర్రబెల్లిని కోరారు. మల్లేశం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి ఏటా ప్రతి జడ్పీటీసీకి రూ.కోటి, ఎంపీపీకి రూ.కోటి చొప్పున కేటాయించాలని, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు హెల్త్కార్డులు ఇవ్వాలని కోరారు. మన ఊరు- మన బడి కార్యక్రమం పనులు స్థానిక సంస్థల ద్వారా జరిగేలా కృషి చేస్తానని చెప్పారు.