జనగామ, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో వైద్య కళాశాలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని చంపక్హిల్స్ ఎంసీహెచ్ వద్ద ప్రభుత్వ మెడికల్ కళాశాలను హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, ల్యాబ్లు, టీచింగ్ గదులను పరిశీలించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన విద్యార్ధినీ, విద్యార్ధులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మెడికల్ కాలేజీ తరగతులను ప్రారంభించుకోవడం..వచ్చే ఏడాది మరో ఎనిమిది కాలేజీలను సిద్ధం చేస్తుండడం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయం అని అన్నారు.
గతంలో వైద్య విద్య ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్నందున పేద, మధ్యతరగతి వర్గాలకు డాక్టర్ కావాలనే కోరిక అందని ద్రాక్షగా ఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా రాష్ట్రంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు. దీంతో సామాన్య విద్యార్ధుల్లో సైతం డాక్టర్లం కావాలనే పట్టుదల, తపన పెరిగిందని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి స్పష్టం చేశారు. మనకోసం ఇంతగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రికి ప్రతీ ఒక్కరూ అండగా నిలవాల్సి ఉందన్నారు. జనగామ ప్రాంతం గతంలో ఏట్లా ఉండేది..తెలంగాణ సాధించుకున్న తర్వాత జిల్లా తెచ్చుకున్న తర్వాత జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల అభివృద్ధి ప్రజల కళ్లముందు కనబడుతున్నదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భూముల ధరలు లక్షలు, కోట్లకు పెరిగాయని.. ఆయన దయవల్లే వ్యవసాయం పండుగగా..రైతు రాజు అవుతున్నడు అని మంత్రి దయాకర్రావు అన్నారు.
ఇవ్వాల జనగామ ఒక అద్భుతం..ఒక మెడికల్ కాలేజీ, ఇంత పెద్ద ఆస్పత్రి ఎప్పుడైనా ఊహించామా? ఇలా అవుతుందని మొన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి డెలివరీలు పరిశీలిస్తే యశోధ ఆస్పత్రి కంటే బ్రహ్మండమైన సౌకర్యాలు ఉన్నాయని కొనియాడారు. ఇది వరకు ప్రైవేట్ ఆస్పత్రికి పోతే బిడ్డ అడ్డం తిరిగిందని ఆపరేషన్ చేసి వేలకు వేలు వసూలు చేసేటోళ్లు..ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెలివరీచేసి కేసీఆర్ కిట్టు, డబ్బులుచ్చి అమ్మఒడి వాహనంలో ఇంటి వద్ద దింపుతున్నారని..ఇంత చేస్తున్న మహానుభావుడి సేవలను మరిచిపోగలమా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ వాళ్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు..ఇన్నిరోజులు ప్రజలను పట్టించుకోనోళ్లు.. ఆరోపణలు చేస్తున్నరు.. ఇప్పుడు మనం యాక్టివ్గా ఉండాలి..ప్రతి దానికి ఎదురు జవాబు చెప్పాలని ఎర్రబెల్లి అన్నారు. కర్నాటక ఎన్నికతోటి కాంగ్రెస్ కొద్దిగా లేచినట్లు లేచింది..అబ్బా ఇగ దగ్గరకు వచ్చినమని సంబుర పడ్డరు..ఎప్పుడైతే రుణమాఫీ చేసినమో..రేవంత్రెడ్డి 3 గంటల కరెంటు అన్నడో మల్ల మంచం కింద పడ్డదని ఎద్దెవా చేశారు. ఊరికి ఒకరో ఇద్దరో మాట్లాడుతుంటరు..అందుకే అలర్ట్ చేయాలే.. మనం ఎవరికీ అన్యాయం చేయలేదు..కేసీఆర్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం మనం అదృష్టంగా భావించాలి’ అని అన్నారు.
ప్రజల బతుకుదెరువు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
‘ఉచితాలు అంటూ తెలంగాణ సంక్షేమ పథకాలను ఎద్దేవా చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతల్లారా..మా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నవి ఉచితాలు కాదు..ప్రజల బతుకుదెరువు అన్న సంగతి గుర్తుంచుకోవాలి’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వారు ఒక్కసారి గతంలో జనగామ ఏట్లుండే..ఇప్పుడు ఎట్లున్నది చూసి మాట్లాడితే జవాబు దొరుకుతుందన్నారు. తెలంగాణ వస్తే జనగామ జిల్లా వచ్చింది..రాష్ట్రంలోనే బ్రహ్మండమైన కలెక్టరేట్ నిర్మించుకున్నం, మెడికల్ కాలేజీ వచ్చిన ఏడాదిలోనే ప్రారంభించుకున్నం..100 సీట్లకు 85 సీట్లు మన వాళ్లకే డాక్టర్ అయ్యే ఛాన్స్ దక్కిందని ఆయన పేర్కొన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాల్టీల్లో జనగామ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో జిల్లా అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలుస్తుందన్నారు.
వైద్యవిద్య కల సాకారం : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
జనగామ జిల్లా వాసులకు మెడికల్ కాలేజీ ఏర్పాటుతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాలకు పరుగులు పెట్టాల్సి వస్తున్నదన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, నెప్రాలజీ తదితర విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం..ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్ధికపరంగా కూడా సమస్యగా ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ప్రారంభం కానుండడంతో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ప్రజలకు ఆరోగ్యపరంగా పూర్తి భద్రత దక్కబోతుందంటున్నారు. తెలంగాణ సర్కార్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు స్థానికంగా పేద విద్యార్ధులకు గొప్పవరమన్నారు. ఫస్టియర్ అడ్మిషన్ పొందేందుకు 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తే..వీటిలో రాష్ట్ర కోటా కింద 85, జాతీయ కోటా కింద 15 సీట్లు భర్తీ చేస్తారన్నారు.
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు : ఎమ్మెల్యే రాజయ్య
జిల్లా కేంద్రంలో మెడికల్ ప్రారంభం కానుండడంతో స్థానికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అంటే న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్టియాలజీ, అంకాలజీ తదితర విభాగాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం ఈ ప్రాంతానికి గొప్ప వరమని అన్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రజల దశాబ్దాల కోరిక అయిన మెడికల్ కాలేజీనీ సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ఎన్నికల సభలో ఇచ్చిన మాట తప్పకుండా జిల్లా ఇచ్చారని, మడమ తిప్పకుండా జిల్లాకు వైద్య విద్య కళాశాల మంజూరు చేసి తరగతులు ప్రారంభిస్తున్న అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు.