‘తెలంగాణ పల్లెలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి సాధించాయి. సీఎం కేసీఆర్ అకుంటిత దీక్ష, పట్టుదలతో గ్రామాలు కడిగిన ముత్యంలా మారాయి. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ర్టాభివృద్ధిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అవార్డులు ఇస్తున్నది.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. గురువారం రాయపర్తి మండలంలోని పెర్కవేడు, గట్టికల్ గ్రామాల్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘పల్లెప్రగతి’ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సర్వతోముఖాభివృద్ధితో పాటు సబ్బండ వర్గాల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తున్నదన్నారు.
– రాయపర్తి, జూన్ 15
రాయపర్తి, జూన్ 15 : కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో మారుమూల పల్లెలు, కుగ్రామాలు, గ్రామీణ ప్రాంతాలన్నింటిలో గణనీయమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలవ్యాప్తంగా తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని పెర్కవేడు, గట్టికల్ గ్రామాల్లో జరిగిన ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. తొలుత మండలంలోని పెర్కవేడు గ్రామానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లి సర్పంచ్ చిన్నాల తారాశ్రీ రాజబాబు, ఎంపీటీసీ బండి అనూషా రాజబాబు సారథ్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం గ్రామ ప్రధాన కూడలిలోని తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలతో కలిసి కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మండలంలోని గట్టికల్ మీదుగా వెళ్తున్న మంత్రి గ్రామానికి చేరుకోగానే పంచాయతీ కార్యాలయం వద్ద ముగ్గులు వేస్తున్న మహిళలను చూసి కిందకు దిగారు. మహిళలతో కలిసి కాసేపు ముగ్గులు వేసి, సర్పంచ్ చిన్నాల వనజా లక్ష్మీనారాయణ సారథ్యంలో జరుగుతున్న జాతీయ పతాకావిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాల తర్వాత గ్రామాలకు కొత్త రూపు సంతరించుకున్నదన్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రైతువేదిక భవనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగాణాలు, డంపింగ్ యార్డులు, సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్లు, తెలంగాణకు హరితహారం, ఎల్ఈడీ వీధి దీపాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నల్లాలతో నగరాలకు దీటుగా పల్లెలు తయారయ్యాయన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అంటేనే సమస్యలకు పుట్టినల్లుగా పరిగణించేవారని, కానీ, నేడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా మారాయన్నారు. రాష్ట్రంలో నిరంతారం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయన్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధితో పాటు సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మండల ప్రజలు అండగా నిలువాలని కోరారు. కాగా, మండలంలోని పన్యానాయక్ తండా, బాలునాయక్ తండాల్లో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తల ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం : అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపిందని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మండలంలోని కొండూరు గ్రామంలో పల్లెప్రగతి దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను సుందరీకరించడంలో గ్రామ పంచాయతీల పాలక వర్గాలు, సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందిని సర్పంచ్ కర్ర సరితా రవీందర్రెడ్డి, ఎంపీటీసీ చిర్ర ఉపేంద్ర, ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, పంచాయతీ కార్యదర్శి నిమ్మల రాజు, వార్డు సభ్యులు వీరమనేని సత్యనారాయణరావు, కర్ర ప్రవీణ్రెడ్డితో కలసి ఘనంగా సన్మానించారు. మండలంలోని 39 గ్రామాల్లో పల్లె ప్రగతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
పర్వతగిరి, రావూరు గ్రామాల్లో..
పర్వతగిరి : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పర్వతగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీతో పాటు రావూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందే పల్లెప్రగతిలో భాగంగా ఇంటింటికీ తోరణాలు కట్టాలని పిలుపు ఇవ్వడంతో మంత్రి తన ఇంటికి పూల తోరణాలు కట్టుకున్నారు. అనంతరం గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఎక్కి నడిపించారు. కార్యక్రమంలో పర్వతగిరి సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, రావూర్ సర్పంచ్ బండి సంతోష్, ఎంపీటీసీ మాడుగుల రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, ఎంపీవో పాక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు రజిత, మహిళా నాయకులు బరిగెల విజయ, గ్రామ పార్టీ అధ్యక్షుడు మేరుగు వెంకన్న, ఉపసర్పంచ్ రంగు జనార్దన్, ఆశవర్కర్లు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.