క‘న్నీటి’ కష్టాలు చుట్టుముట్టిన ములుగు, జయశంకర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల ముంపు బాధితులకు రాష్ట్ర సర్కారు అన్నీ తానై ఆదుకుంటున్నది. భీకర వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని పూడ్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ముంపు బాధితులను వాటిలోకి తరలించి సౌకర్యాలు కల్పించింది. ఆహారం, తాగునీరు, మందులను సరఫరా చేస్తున్నది. ఇంకా వరదలోనే ఉన్న గ్రేటర్ వరంగల్లో పునరుద్ధరణ పనులు, సహాయక చర్యలను వేగవంతం చేసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జంపన్నవాగు ఉధృతి కారణంగా నీటిలో మునిగిన కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు శుక్రవారం తేరుకోగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లా అధికారయంత్రాంగం హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టింది. ఆహార ప్యాకెట్లు, మందులను అందించడంతో పాటు ముంపులో ఉన్నవారిని రెస్క్యూటీం ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. మరోవైపు జయశంకర్ జిల్లాలో మోరంచవాగు ఉగ్రరూపంతో నీటమునిగిన మోరంచపల్లి, రాష్ట్ర ప్రభుత్వ తక్షణ స్పందనతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఇక్కడివారికి పునరావాసం కల్పించడంతో పాటు గ్రామంలో అధికారయంత్రాంగం పారిశుధ్యచర్యలను చేపట్టింది. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయార్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీప్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య ఆయాచోట్ల బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. స్వయంగా భోజనం అందించి ఓదార్చారు.
భారీ వర్షాలు, వరదలతో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాలు అతలాకుతలం కాగా, ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయా జిల్లాల్లో నష్టాన్ని పూడ్చేందుకు ఓవైపు చర్యలు చేపడుతూనే అభాగ్యులకు అన్నీతానై నిలుస్తున్నది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారాన్ని సరఫరా చేస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి వానలు ఆగిపోవడంతో సహాయక చర్యలు సాఫీగా సాగుతున్నాయి. వరద నీటితో తెగిపోయిన రోడ్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. వరంగల్ నగరంలోని చాలా రోడ్లలో రాకపోకలను పునరుద్ధరించారు. వర్షాలు భారీగా పడుతున్న సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించి, సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హెలిక్యాప్టర్లు, రెస్యూ టీమ్లు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు తేడా లేకుండా కష్టపడి లోతట్టు ప్రాంతాల నుంచి వేలాది మందిని పునరావాస కేంద్రాలకు చేర్చారు. ఆహార పొట్లాలు, మంచి నీరు, మందులు అందించారు.
జయశంకర్ జిల్లాలో మోరంచవాగు ఉగ్రరూపం దాల్చి నీటమునిగిన మోరంచపల్లి రాష్ట్ర ప్రభుత్వ తక్షణ స్పందనతో పెనుప్రమాదం నుంచి బయటపడింది. వరదలు మిగిల్చిన కన్నీటి నుంచి తేరుకుంటున్నది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర దంపతులు, కలెక్టర్, ఎస్పీలు శుక్రవారం గ్రామానికి చేరుకుని ప్రతి ఇంటికీ తిరుగుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పునరావాస కేంద్రాలను సందర్శించి ఆహారం, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారు తిరిగి గ్రామానికి చేరుకునే వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మోరంచపల్లిలో ప్రతి ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తూ బ్లీచింగ్ చేశారు. పారిశుధ్య పనులు, విద్యుత్ మరమ్మతులు వేగవంతం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ టీం మోరంచవాగులో గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగిస్తున్నది. కాగా జీఎంఆర్ ట్రస్టు ద్వారా బాధితులకు రూ.10 లక్షల చెక్కును ఎమ్మెల్యే గండ్ర మోరంచపల్లి సర్పంచ్కు అందజేశారు.
వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకరమణారెడ్డి పర్యటించారు. సహాయక చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. జరిగిన నష్టాన్ని, చేపట్టాల్సిన చర్యలను వివరించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పరిమళ కాలనీ, జవహర్నగర్లో నీటి ముంపు ప్రాంతాలను మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం పరిశీలించారు. పలివేల్పుల, గుండ్లసింగారం కాలనీలను వరదలతో కోతకు గురైన బ్రిడ్జిని పరిశీలించారు. ఏటూరునాగారం మండలం కొండాయిలో బాధితులకు, భద్రాచలం ప్రాంతంలో వరదల్లో చికుకుని ఆందోళన చెందుతున్న బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీరు, మందులను మామునూరు హెలిప్యాడ్ నుంచి పంపించారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ కాజీపేటలోని వైఎస్ఆర్ నగర్ ముంపు ప్రాంతంలో భోజనం ఏర్పాటు చేసి వారికి స్వయంగా వడ్డించారు. ధర్మసాగర్ మండలం వేలేరు, పిచర గ్రామాల్లో మత్తడి పోస్తున్న చెరువులను ఎమ్మెల్యే రాజయ్య సందర్శించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పునరావాస కేంద్రాల్లోని వారికి మేయర్ గుండు సుధారాణి దుప్పట్లను పంపిణీ చేశారు. పరకాల మండలం పైడిపల్లి, మలకపేట, పరకాల పట్టణంలో వరద నష్టాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. పరకాల-భూపాలపల్లి రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకున్నారు. కాజీపేట-బల్లార్ష సెక్షన్లో రైలు ప్రయాణాలను పునరుద్ధరించారు. హనుమకొండ కొత్త బస్టాండ్ రోడ్డు మరమ్మతులు మొదలయ్యాయి.
జంపన్నవాగు వరదల కారణంగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో నీట మునిగిన కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు శుక్రవారానికి తేరుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం హెలిక్యాప్టర్ ద్వారా సహాయ చర్యలు చేపట్టింది. వరదల ప్రారంభ సమయంలో గ్రామస్తులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న క్రమంలో ఎనిమిది మంది గల్లంతై మృతి చెందారు. శుక్రవారం వరదలు తగ్గుముఖం పట్టిన అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొండాయికి చేరుకొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు గల్లంతైన వారి మృతదేహాలను వెలికి తీశాయి. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేక గురువారం హెలికాప్టర్ సేవలు అందలేకపోయాయి. గ్రామాల్లో కొన్ని ఇండ్లు కూలిపోగా, మరికొన్ని దెబ్బతిన్నాయి. పంచాయతీ భవనం, పల్లె దవాఖాన, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లి బాధితులు తల దాచుకున్నారు. శుక్రవారం హెలికాప్టర్ ద్వారా అక్కడి ప్రజలకు ఆహారం, మంచినీళ్లు, మందులు అందించారు. మల్యాల, కొండాయి గ్రామాల్లో ఉన్న ఆరుగురు గర్భిణులను బోటు సాయంతో దొడ్ల వరకు తీసుకవచ్చి అక్కడ నుంచి అంబులెన్స్లో ఏటూరునాగారం తరలించారు. వాజేడు, వెంకటాపురం(నూగూరు), మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో ముంపు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరద సహాయక చర్యల కోసం సీఎం కేసీఆర్ ములుగు కలెక్టర్ ఖాతాలో కోటి రూపాయలు జమచేశారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.25 వేలను అందించనున్నారు. పస్రా వద్ద తెగిపోయిన జాతీయ రహదారికి మరమ్మతులు చేశారు.