తెలంగాణలోని అన్ని గ్రామాలకు మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని.. అందుకే గ్రామాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఈనెల 11న సీఎం కేసీఆర్ జనగాం పర్యటన సందర్భంగా వరంగల్ జిల్లాలోని రాయపర్తిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో అప్రతిహాత అభివృద్ధి జరిగింది. ప్రతి గ్రామానికి కోట్ల కొద్ది నిధులు వచ్చాయి. గతంలో మంచినీరుకు కూడా గతి లేదు. వచ్చే మార్చి నుంచి స్థలాలు ఉన్న అర్హులైన వాళ్లకు ఇండ్లు ఇస్తాం. వచ్చే మూడేండ్లలో దళితులు అందరికీ దళిత బంధు ఇస్తాం. రాజ్యాంగాన్ని సవరించాలనడం నేరం కాదు. కావాలని కొందరు కల్పిత వివాదం సృష్టిస్తున్నారు. అలాంటి వాటిని టీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలి. మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.. దుష్ప్రచారం చేస్తున్న వాళ్లను నిలదీయాలి.. అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
రైతుకు ఇంతగా చేసిన ప్రభుత్వం దేశంలో ఇంకోటి ఉందా? రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి, తోక ముడిచినది ఎవరు? కరెంట్ను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూసింది ఎవరు? కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నది. అయినా సీఎం కేసీఆర్ ఎంతో అద్భుతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. కనీవినీ ఎరగని రీతిలో మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది. ఇవన్నీ వివరించడానికే సీఎం కేసీఆర్ జనగాం సభ పెడుతున్నారు. ఆసభను సూపర్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనది. జనం, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా కదిలి రావాలి. అత్యధిక పార్టీ సభ్యత్వం ఉన్న మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ పవర్ ఏంటో చూపించాలి. జనగాం సభ ప్రతిపక్షాలకు సవాల్గా నిలవాలి.. అని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.