Errabelli | జనగామ, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : రేవంత్రెడ్డి, వైస్ షర్మిల పాదయాత్రల పరువు తీస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే రాజయ్య, జనగామ జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా రేవంత్, షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని మీరు నా గురించి మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలే..చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..లేదంటే మీరు పదవులు వదిలి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ చేశారు. ‘రేవంత్ మాత్రమే కాదు ఆయన చుట్టూ ఉన్న వాళ్లందరి పైనా భూ కబ్జా కేసులు ఉన్నాయి. వాళ్లు ప్రజల కోసం జైలుకు పోలే. కుంభకోణాలు, కుట్రలు, కుతంత్రాల కేసుల్లో జైలుకు పోయారు’ అని మండిపడ్డారు. ‘నేను పట్టుబట్టి 15మంది ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించిన.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఏం చేశావో చెప్పు రేవంత్.. నీ మీద ఉద్యమ కేసు ఒకటైనా ఉందా?’ అని నిలదీశారు. ‘రాజకీయాల్లో మా నాయిన, నేను మచ్చ లేకుండా ఉన్నాం. మీకు మా గురించి మాట్లాడే అర్హత, హకులు లేవు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ప్రజల కోసం జైలుకు పోయిన. నీటి కోసం బాబ్లీకి పోయి పోలీసులతో దెబ్బలు తిన్న. రైతుల కోసం ఇప్పటికీ కేసులు అనుభవిస్తున్నా. గ్రానైట్ సమస్యలపై పోరాడితే అనంతపూర్లో కేసులు పెట్టిన్రు’ అని చెప్పారు. ‘నేను రాజకీయాల్లో మళ్లీ గెలుస్తా.. ఎకడ నిలబెట్టినా మళ్లీ మళ్లీ గెలుస్తా.. ఒకసారి గెలిచిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయని నువ్వు నీ కొడంగల్లో మళ్లీ గెలుస్తవా? మలాజిగిరిలో మళ్లీ పోటీ చేస్తావా?’ అని రేవంత్ను ప్రశ్నించారు. ‘నీవు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమే. నీ గురించి నీ కాంగ్రెస్ వాళ్లే మాట్లాడుతున్నరు’ అని ఎద్దేవా చేశారు.
‘నేను ఇంటర్ చేశా.. పెద్దగా చదువుకోక పోయినా..ప్రజల మనోభావాలు చదివిన.. ప్రజల అవసరాలను తీరుస్తున్న.. అభివృద్ధి చేస్తున్న.. ప్రజలు నన్ను అందుకే గెలిపిస్తున్నరు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన చరిత్ర నాది.. నువ్వు నా గురించి మాట్లాడే వాడివయ్యావా? రేవంత్.. మా తాతలకు 1600 ఎకరాల భూమి ఉండేది. ఇప్పుడు వంద ఎకరాలు మిగిలింది. పేదలకు ఉచితంగా ఇచ్చిన మా భూముల్లో తండాలు కట్టుకున్నారు అది నీకు తెలుసా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీలా, నీ చెంచా జంగా లాగా భూకబ్జాలు, దందాలు, మోసాలు వంటి ఒక్క చిన్న కేసు కూడా నాపైన లేదు. నా రాజకీయ జీవితంలో అలాంటి పనులు చేశానని ప్రజలు, బాధితులు ఏనాడైనా ధర్నాలు చేశారా? కేసులు పెట్టారా? రికార్డులు చూసుకొని మాట్లాడు’ అంటూ హితవుపలికారు. ‘రేవంత్రెడ్డిది బ్లాక్మెయిల్ చరిత్ర. ప్రజలను జిమ్మిక్కులతో మోసం చేసే నైజం. పైసలు వసూలు చేసి పబ్బం గడుపుకునే తత్వం. ఆయన వెంట తిరుగుతున్న జంగా రాఘవరెడ్డి ఓ క్రిమినల్. పెద్ద ల్యాండ్ గ్యాబర్. పచ్చి మోసగాడు. అలాంటి వాళ్లకు నా గురించి మాట్లాడే స్థాయి ఉందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ వల్లే కాంగ్రెస్ గెలవని దుస్థితి
‘నీవు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమే..నీదో ఐరన్లెగ్. గతంలో 15 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఐదు సీట్లు కూడా గెలవలేని స్థితికి రేవంత్రెడ్డి వల్లే వచ్చింది’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రేవంత్ తుపాకిరాముని లెక్క మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ‘రేవంత్, షర్మిల పాదయాత్రలను నిలిపి వేస్తామని మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పట్టుపడితే, నేనే వద్దని వారించిన. వాళ్లు చచ్చిన పాములు.. వద్దని నేనే ఆపిన. ఒకవేళ నేనే అడ్డుకోవాలనుకుంటే మీరు జనగామ జిల్లాలో, పాలకుర్తి నియోజకవర్గంలో తిరిగే వారా? పాదయాత్రలు చేసే వారా? పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దు! కనీస సంసారాన్ని పాటించండి.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు గుర్తు పెట్టుకోండి’ అంటూ హితవు పలికారు. ‘అమ్మా.. షర్మిలా!..కొద్దో గొప్పో మీ నాయినకు మంచి పేరుంది.
దాన్ని చెడగొట్టకు.మాటలు మంచిగా రానివ్వమ్మా. కొంచమైనా సంసారాన్ని పాటించి మాట్లాడు.. నువ్వు మహిళవన్న సంగతి మరచి పోవద్దు. నీ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నరు. మహిళల గౌరవం కాపాడు. మీ ఆరోపణలు చూసి అంతా సిగ్గు పడుతున్నరు. మీ విజ్ఞతకు, సంసారానికే వదిలేస్తున్న’ అంటూ చురకలంటించారు. ‘పాలకుర్తిలో హాస్పిటల్ లేదని అంటున్నారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ ఇచ్చాక పెద్ద హాస్పిటల్ వచ్చింది. జనగామకు సమీపంలోనే ఉన్న పాలకుర్తికి ఆ అవసరం లేదని మాత్రమే ఇవ్వలేదు. పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్కు డిగ్రీ కాలేజీ మంజూరైంది. ముందు ఇది తెలుసుకొని మాట్లాడితే మంచిగుండేది’ అన్నారు. ‘రాయపర్తి సమీపంలోని మహబూబ్నగర్లో ముస్లింల భూములు అక్రమించానని ఆరోపిస్తున్నారు.. కానీ ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో తెలుసుకొని మాట్లాడితే ప్రజలు హర్షించేవాళ్లు’ అని పేర్కొన్నారు.
500 మంది కిరాయి గూండాలు..
‘200 కార్లు.. 500 మంది కిరాయి గూండాలు.. కాంట్రాక్ట్ పద్ధతిలో పాదయాత్ర చేస్తున్న మీరు మా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రేవంత్, షర్మిల పాదయాత్రల పరువు తీస్తూ, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. అసలు మీ పాదయాత్రలకు ప్రజల స్పందన ఉందా? ఏం చేశారని సిగ్గులేకుండా ప్రజల్లోకి వస్తున్నారు?’ అని మంత్రి మండిపడ్డారు. ‘దయాకర్రావు తప్పులు చేస్తే పాలకుర్తిలో మళ్లీ జంగా పోటీచేయవచ్చు కదా? రేవంత్ను ఎందుకు రమ్మంటున్నవ్’ అని ప్రశ్నించారు.
కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఎడారి అయ్యేది..
‘దేవాదుల ప్రాజెక్టు అన్యాయం అయింది కాంగ్రెస్ హయాంలోనే..టీడీపీ ఇంకా అన్యాయం చేసింది.. సీఎం కేసీఆర్ వచ్చాకే దేవాదుల ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. లేకుంటే తెలంగాణ ఎడారి అయ్యేది’ అని మంత్రి స్పష్టం చేశారు. ‘రూ.100 కోట్లు అదనంగా పెట్టి మరీ ప్రాజెక్ట్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ది. మొత్తం రూ.375కోట్లు ఖర్చు చేస్తున్నాం. దేవాదుల నీటితో చెరువులు నింపినం. జనగామ వంటి కరువుగడ్డలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు గోదావరి నీటితో నిండి..నిండు కుండలా ఉన్నాయంటే కారణం కేసీఆర్ కాదా?’ అని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఇస్తే కరెంటు 6గంటలు రాదని నాడు కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో అన్నడు. కేసీఆర్ సీఎం అయ్యాక కష్టపడి రైతులకు 24గంటల కరెంటు ఇస్తున్నడు..ఎక్కడైన చిన్నిచిన్న సమస్యల వల్ల కరెంటు ఇబ్బందులు ఉండొచ్చు..మన నీళ్లు మహారాష్ట్రకు ఇవ్వడంలేదు..అది తప్పుడు విమర్శ..కాంగ్రెస్ హాయాంలోనే శ్రీరాంసాగర్ ఎండిపోయింది..ఇప్పుడు కాళేశ్వరం వల్లే వరంగల్కు నీళ్లు వస్తున్నాయ్..ఇవన్నీ మీ కళ్లకు కనిపించవు..అదే పనిగా విమర్శిస్తారు..ఆరోపణలు చేస్తారు.. ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరు..మీ కల్లబొల్లి కబుర్లు ఇక కట్టి పెట్టండి’ అని మంత్రి హితవు పలికారు. మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏడవెల్లి కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జనగామ జడ్పీటీసీ నిమ్మతి దీపిక, ఎంపీపీ కళింగరాజు, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి ఉన్నారు.
‘రేవంత్, జంగా లంగా లఫూట్లు’
దేవరుప్పుల : దేవరుప్పుల చౌరస్తాలో మంత్రి మాట్లాడుతూ ‘నన్ను వ్యక్తిగతంగా లేనిపోని కల్పనలతో దూషించేందుకే యాత్ర చేపట్టారు. పాలకుర్తిలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి మాటలు రాక, నా మీద పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వ్యక్తిగత దాడికి దిగారు. వారిదద్దరూ లంగా లపూట్లు’ అని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో భూకబ్జాలు లేవు, మర్డర్లు లేవు, కేసులు లేవు. రేవంత్, జంగాలపై అనేక భూకబ్జా కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి. దొంగ కేసులు ఉన్నాయి. ఇవన్నీ మరిచి మచ్చలేని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే పాలకుర్తి ప్రజలు నమ్ముతారనుకోవడం వారి అవివేకమే..’ నని ఎద్దేవా చేశారు. పాలకుర్తిలో రేవంత్, జంగా ఎవరు నిలబడ్డా స్వాగతిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెబుతుంటే పార్టీలోనే సఖ్యతలేని రేవంత్రెడ్డి పొద్దుపోక దొంగ పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.