ఒకప్పుడు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొన్న పాలకుర్తి నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. త్వరలోనే మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్తో కొడకండ్లలో మినీ టెక్స్టైల్పార్కుకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రూ.70 లక్షల వ్యయంతో కొడకండ్లలో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.15 లక్షలతో పూర్తి చేసిన గ్రంథాలయ భవనాన్ని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి బుధవారం మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో కరువును ఎదుర్కొన్న కొడకండ్ల మండలాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. దీనిని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నేతలు మాయమాటలు చెబుతున్నారని, దీనిని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కొడకండ్ల, జూన్28: బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కును త్వరలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత కొడకండ్లలో రూ.70లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి, రూ.15 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో మంత్రికి పెద్దఎత్తున బోనాలు, బతుకమ్మలు, నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం శివరాత్రి ఇద్దయ్య స్మారకార్థం అతడి కుటుంబం కొడకండ్ల జీపీకి ఇచ్చిన ఫ్రీజర్ను మంత్రి దయాకర్రావు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువు కాటకాలతో విలవిల్లాడిన కొడకండ్ల, ఇప్పుడు కరువుతీరా అభివృద్ధితో కళకళలాడుతున్నదని తెలిపారు. రూ.100 కోట్లతో అభివృద్ధి చేశానని, ఇక్కడి చేనేత కార్మికుల కోసం, వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అనేక మందికి ఉపాధి కలిగే విధంగా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ను మంత్రి కేటీఆర్తో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రోడ్లు బాగు చేశామని, గ్రామాల్లో అంతర్గతంగా సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. గతంలో రూ.6కోట్లు సీసీ రోడ్లకు ఇచ్చానని, ఇప్పుడు కొత్తగా రూ.5కోట్లు మంజూరు చేస్తున్నానన్నారు. బయ్యన్న వాగుపై రూ.9 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నామని, కొడకండ్లలో అన్ని రహదారులను డబుల్ రోడ్లుగా మరుస్తున్నానని వివరించారు. అలాగే రోడ్డు వెడల్పు చేసి, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెడుతున్నట్లు తెలిపారు.
ఒక్క కొడకండ్లకే రానున్న రోజుల్లో రూ.100కోట్లు ఖర్చు చేసి రూపురేఖలు మారుస్తానన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కుట్టు శిక్షణ ఒక్క పాలకుర్తి నియోజకవర్గంలోనే చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, పాలకుర్తి ప్రజల కోసం ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక్కడి రైతులు, కూలీలు హైదరాబాద్కు వలస పోయారని సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ ప్రాంత అభివృద్ధిని చూసి తిరిగి వస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. కొడకండ్లలో కుల సంఘాల కోసం సామాజిక భవనాలను మంజూరు చేసి, వారు కార్యక్రమాలు చేసుకోవడానికి వేదిక నిర్మిస్తున్నట్లు తెలిపారు. మీ కోరిక మేరకు గ్రామంలో దేవాలయాలను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.
ముస్లింలు, క్రైస్తవుల కోరిక మేరకు మసీదులు, చర్చిల మరమ్మతులకు నిధులు ఇచ్చానని తెలిపారు. అదేవిధంగా మండల మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ‘కష్టకాలంలో కొడకండ్ల నన్ను ఆదుకున్నది. ఇక్కడి ప్రజలను నేను ఆదుకుంటున్నా. నన్ను కడుపులో పెట్టుకున్న నియోజకవర్గ ప్రజలకు ఎంతచేసినా తక్కువే. అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా.’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, డీసీసీబీ వైస్చైర్మన్ కుందురు వెంకటేశ్వర్రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.