తాడ్వాయి, ఫిబ్రవరి 4;తల్లీ మమ్ముల కరుణించు అని వేడుకుంటూ వనదేవతలు సమ్మక్క-సారలమ్మలకు భక్తజనం మనసారా మొక్కులు సమర్పించింది. ఈ నెల ఒకటో తేదీన మండమెలిగే పండుగతో మేడారం మినీ జాతర మొదలుకాగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా వచ్చిన భక్తులతో వనమంతా పులకించింది. నాలుగు రోజులుగా అటు జంపన్న వాగు, అమ్మవార్ల గద్దెల ప్రాంగణాలు కళకళలాడగా నెత్తిన బంగారం బుట్టలు, శివసత్తుల పూనకాలు, చిన్నారుల కేరింతలతో ఎటూచూసినా సందడిగా కనిపించింది. చివరి రోజు శనివారం గద్దెల వద్ద ఉంచిన పూజా సామగ్రిని సమ్మక్క-సారలమ్మ పూజారులు మందిరాలకు తీసుకెళ్లడంతో జాతర పరిసమాప్తమైంది. వచ్చే బుధవారం తిరుగువారం నిర్వహించి పూజా సామగ్రిని శుద్ధిచేసి భద్రపరుస్తారు.
కోరిన కోర్కెలు తీర్చే బంగారు తల్లుల దర్శనానికి భక్తులు పోటెత్తారు. చివరి రోజైన శనివారం వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది రావడంతో జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై నిలువెత్తు బంగారం(బెల్లం)తో పాటు పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, నూతన వస్ర్తాలను సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను నాలుగు రోజుల్లో మూడున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 1న అమ్మవార్ల పూజారులు మండెమెలిగే పండగతో మినీ జాతరను ప్రారంభించగా శనివారం వరకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. నేడు ఆదివారం సెలవు దినం కావడంతో బారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కాగా పూజామందిరాల్లో ఉంచిన పూజా సామగ్రిని వచ్చే బుధవారం తిరుగువారం పండుగ నిర్వహించి శుద్ధి చేసి భద్రపరుస్తారు. అదే రోజు పూజారుల కుటుంబాలు వన భోజనాలకు వెళ్తారు.
కాలినడకన తల్లుల చెంతకు
కోరిన కోర్కెలు తీర్చు తల్లీ అంటూ వేడుకుంటూ వరంగల్ కరీమాబాద్కు చెందిన కాలం మహేశ్వర్, నాగ మహర్షి కాలినడకన మేడారం చేరుకున్నారు. గురువారం ఉదయం పాదయాత్రగా బయల్దేరి వీరిద్దరు శనివారం మధ్యాహ్నం తల్లుల గద్దెల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లుల దీవెన కోసం పాదయాత్రగా వచ్చామని వారు చెప్పారు. మహాజాతర, మినీ జాతరకు కాలినడకన మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకుంటామని వారు తెలిపారు.