ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు మినీ డెయిరీ పథకం ద్వారా వారికి బర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉన్న పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలకు 200 యూనిట్లను మంజూరు చేసింది. ఒక్కో యూనిట్ విలువ రూ.2 లక్షలు. ఇందులో 70 శాతం రూ.1.40 లక్షలు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తోంది. మిగిలిన 30 శాతం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుటారు. ఇప్పటికే రెండు మండలాల్లో 150 మంది అర్హులను ఎంపిక చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ వెల్లడించారు.
వరంగల్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఎస్సీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పాడి పరిశ్రమ వైపు ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో మినీ డెయిరీ పథకం ద్వారా సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును ఎస్సీ రిజర్వ్డ్ శాసనసభ నియోజకవర్గాల్లో అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలో వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలోని పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలకు 200 యూనిట్లను మంజూరు చేసింది. ఒక్కో యూనిట్ విలువ రూ.2లక్షలు. ఇందులో 70 శాతం రూ.1.40లక్షలు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తోంది. మిగతా 30 శాతం బ్యాంకు నుంచి లబ్ధిదారులు రుణాలు పొందుతారు. ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడంతో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో మినీ డెయిరీ పథకం అమలుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే రెండు మండలాల్లో ఈ పథకానికి అర్హులైన 150 మందిని ఎంపిక చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2019-20లో ఎస్సీల కోసం మినీ డెయిరీ పథకాన్ని రూపొందించింది. ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాల్లో అమలు చేసింది. జిల్లాలో నర్సంపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం మండలాలతోపాటు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 438 మంది లబ్ధిదారులకు మినీ డెయిరీ పథకం నుంచి యూనిట్లను పంపిణీ చేసింది. వీటిలో ఒక్కో యూనిట్ విలువ రూ.4లక్షలు. ఇందులో ప్రభుత్వం 60శాతం సబ్సిడీగా ఇచ్చింది. అంటే యూనిట్ విలువలో రూ.2.40లక్షలు. మిగతా 40 శాతం రూ.1.60లక్షలు రుణంగా బ్యాంకుల నుంచి లబ్ధిదారులు పొందారు. రూ.4లక్షల యూనిట్లో భాగంగా ఒక్కో లబ్ధిదారుకు ప్రభుత్వం నాలుగు బర్రెలను పంపిణీ చేసింది. స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు, బ్యాంకుల మేనేజర్లు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారులతో కలిసి మహారాష్ట్ర, హర్యానా రాష్ర్టాల్లో ఈ బర్రెలను కొనుగోలు చేశారు. నాలుగు బర్రెలను ఒకేసారి కాకుండా రెండు విడుతల్లో పంపిణీ చేశారు. రెండు, మలివిడుత రెండు బర్రెల చొప్పున కొనుగోలు చేసి అందజేశారు.
ఒక్కో లబ్ధిదారుకు రెండు బర్రెలు
మినీ డెయిరీ పథకం నుంచి ఒక్కో లబ్ధిదారుకు నాలుగు బర్రెలు ఇవ్వడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి రెండు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ శాసనసభ నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు రెండు బర్రెలతో కూడిన యూనిట్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని వర్ధన్నపేట మండలానికి 100, పర్వతగిరి మండలానికి 100 యూనిట్లను మంజూరు చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారులు ఈ రెండు మండలాల్లో అర్హులైన ఎస్సీలను మినీ డెయిరీ యూనిట్ల కోసం ఎంపిక చేస్తున్నారు.
స్థానిక ఎంపీడీవోతోపాటు బ్యాంకు మేనేజర్లు ఈ ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండు మండలాల్లో 200 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్ ద్వారా తనకు అందే జాబితాపై కలెక్టర్ ఆమోదముద్ర వేస్తారు. 200 యూనిట్ల విలువ రూ.4కోట్లు. ఇందులో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.2.80కోట్లు. మిగిలిన రూ.1.20కోట్లను రుణంగా బ్యాంకులు లబ్ధిదారులకు సమకూర్చుతాయి. ఇప్పటికే 200 యూనిట్లలో 150 యూనిట్లకు రెండు మండలాల్లో 150 మంది లబ్ధిదారుల ఎంపిక జరిగినందున మిగిలిన 50 యూనిట్లకు 50 మంది లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరలో 200 యూనిట్లకు ఎస్సీలను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం పూర్తికాగానే కలెక్టర్ నుంచి అనుమతి పొంది వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో 200 మందికి మినీ డెయిరీ పథకం నుంచి బర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఒక్కో లబ్ధిదారుకు రెండు బర్రెలను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు, బ్యాంకర్లు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో పాటు లబ్ధిదారులు బర్రెలను కొనుగోలు చేయనున్నారు.
నెక్కొండ, నల్లబెల్లిలో 72 మంది ఎంపిక
మినీ డెయిరీ పథకం నుంచి నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో మిగతా నెక్కొండ, నల్లబెల్లి మండలాల్లో ఎస్సీలకు 72 యూనిట్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఈ నియోజకవర్గంలోని దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో ఇప్పటికే 438 మంది ఎస్సీలకు ఒక్కొకరికి రూ.4లక్షల యూనిట్లను పంపిణీ చేసింది. నెక్కొండ, నల్లబెల్లి మండలాల్లోని ఎస్సీలకు కూడా బర్రెల యూనిట్లను అందజేయాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు కొద్దిరోజుల నుంచి అధికారులు 72మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో ఒక్కో లబ్ధిదారుకు రెండు విడుతల్లో నాలుగు బర్రెలను త్వరలో కొనుగోలు చేసి ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు.
రూ.4లక్షల యూనిట్లో ప్రభుత్వం లబ్ధిదారులకు 60శాతం రూ.2.40లక్షలు సబ్సిడీగా ఇవ్వనుంది. ఈ 72 యూనిట్ల విలువ రూ.2.88 కోట్లు. ఇందులో సబ్సిడీ కింద లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి రూ.1కోటీ 72లక్షల 80వేలు అందనున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో ఈ మినీ డెయిరీ పథకం అమలుకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో బ్యాంకులు ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రుణం ఇచ్చేందుకు సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి. మినీ డెయిరీ పథకం అమలుతో పాడి పరిశ్రమ ద్వారా లబ్ధిదారులు ఆశించిన లాభాలను పొందుతున్నారు.