నర్సంపేట, జనవరి18 : నర్సంపేట మున్సిపాలిటీని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా తొమ్మిది గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం శనివారం గెజిట్ విడుదల చేసింది. దీంతో మున్సిపాలిటీ మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం 44వేల మంది జనాభా ఉండగా, విలీన గ్రామాల జనాభా దాదాపు 15వేలు కలుపుకొని 60వేలు దాటనున్నది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రేడ్-3లో ఉన్న మున్సిపాలిటీ గ్రేడ్-2కి అప్గ్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది.
విలీన గ్రామాల్లో ఇప్పటి వరకు సెర్ప్ కింద పని చేసిన మహిళా సంఘాలు ఇక నుంచి మెప్మా కిందకు రానున్నాయి. ఉపాధి పథకం మినహా అన్ని పథకాలు విలీన తొమ్మిది గ్రామాల్లో అమలు కానున్నాయి. నర్సంపేట మండలంలో 27 గ్రామ పంచాయతీలుండగా వీటిలో తొమ్మిది గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపల్ పరిధిని విస్తరించనున్నారు. నర్సంపేట మండలానికి చెందిన మాధన్నపేట, నాగుర్లపల్లి, పర్శనాయక్తండా, ముత్తోజిపేట, రాజుపేట, మహేశ్వరం, రాములునాయక్తండా, ముగ్ధుంపురం, రాజపల్లి గ్రామాలు నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. మొత్తంగా నర్సంపేట మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా విస్తరణకు అడుగులు పడ్డాయి.