వరంగల్, జూలై 13 (నమస్తేతెలంగాణ) : అధికారుల పని తీరుపై జడ్పీటీసీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిధులు ఇచ్చినా నిర్దేశిత గడువు ప్రకారం అభివృద్ధి పనులు జరగడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం జడ్పీ పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. 1, 2, 4, 7 స్థాయీ సంఘ సమావేశాలకు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, 3వ స్థాయీ సంఘ సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్, 6వ స్థాయీ సంఘ సమావేశానికి పర్వతగిరి జడ్పీటీసీ సభ్యుడు సింగ్లాల్, 5వ స్థాయీ సంఘ సమావేశానికి నడికూడ జడ్పీటీసీ సభ్యురాలు సుమలత అధ్యక్షత వహించారు. జడ్పీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న, సంగెం, పరకాల జడ్పీటీసీ సభ్యులు సుదర్శన్రెడ్డి, మొగిలితో పాటు జిల్లాలోని పలువురు జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఈ స్థాయీ సంఘ సమావేశాలకు హాజరయ్యారు. 2వ స్థాయీ సంఘ సమావేశంలో పేదరిక నిర్మూలన, ప్రాంతీయ కార్యక్రమాలు, ఉపాధి, సహకారం, ఎక్సైజ్, పొదుపు, చిన్న మొత్తాల పొదుపు, కుటీర, గ్రామీణ, లఘు పరిశ్రమలు, 3వ స్థాయీ సంఘ సమావేశంలో వ్యవసాయం, పశు సంవర్ధక, భూమిని సాగుకు యోగ్యం చేయడం, వాలు గట్లు వేయడం, సామాజిక అడవుల పెంపకం, మత్స్య పరిశ్రమ, మార్కెటింగ్, పట్టు పరిశ్రమ, 5వ స్థాయీ సంఘ సమావేశంలో మహిళల అభివృద్ధి, పిల్లల సంక్షేమం, 6వ స్థాయీ సంఘ సమావేశంలో సాంఘిక సంక్షేమం, జన జాతుల, వెనుకబడిన వర్గాల సంక్షేమం, అల్ప సంఖ్యాక వర్గాలు, సాంస్కృతిక వ్యవహారాలపై చర్చ జరిగింది.
4వ స్థాయీ సంఘ సమావేశంలో సాంఘిక విద్య, వైద్య సేవలు, ప్రజారోగ్యం, మురుగు నీటి పారుదల, పారిశుధ్యం, క్రీడలు, అత్యవసర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి సాయం, 7వ స్థాయీ సంఘ సమావేశంలో పంచాయతీరాజ్, సంచార మార్గాలు, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, భూగర్భ జలశాఖ, ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్ట్, జాతీయ రహదారులు, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, నీటి పారుదల, 1వ స్థాయీ సంఘ సమావేశంలో జిల్లా ప్రణాళిక, బడ్జెట్ పన్ను విధింపు, మైన్స్, పౌర సరఫరా, ఆర్థిక విషయాలు, ఇతర స్థాయీ కమిటీలకు సంబంధించిన పనుల సమన్వయంపై జరిగిన చర్చలో పాల్గొన్న జడ్పీటీసీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధానంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కొందరు తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో రహదారులు, భవనాల నిర్మాణం, మరమ్మతుల వంటి పనులు ముందుకు సాగడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. నిధులు అందుబాటులో ఉన్నా కాల పరిమితి ముగిసిపోతుందే గానీ పనులు పూర్తి కావడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, నీటి పారుదల విభాగాల ఇంజినీర్లు, విద్య, వైద్య, పౌర సరఫరాల, మహిళా సంక్షేమం, పంచాయతీ, ఎక్సైజ్ తదితర శాఖల అధికారుల పని తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.
పనుల పురోగతిపై మాట్లాడడానికి సైతం కొందరు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారని, ఫోన్ చేస్తే కూడా స్పందించడం లేదన్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, గతంలోనూ జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల నిర్లక్ష్య వైఖరిని తెలిపామని, జడ్పీ సర్వ సభ్య సమావేశాల్లోనూ ప్రభుత్వం దృష్టికి తెచ్చామని గుర్తు చేశారు. జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. జడ్పీ సీఈవో ఎం సంపత్రావు, డిప్యూటీ సీఈవో సాహితిమిత్ర, డీఈవో వాసంతి, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు జితేందర్రెడ్డి, శంకరయ్య, వెంకటరమణారెడ్డి తదితరులు సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు, దుగ్గొండి పంచాయతీరాజ్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తూ రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన జే కూచయ్య, పొనక సుగుణకు జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సీఈవో సంపత్రావు, డిప్యూటీ సీఈవో సాహితీమిత్ర, ఇతర అధికారులతో కలిసి ఉత్తర్వులు అందజేశారు.