‘పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తూ దేశానికే దిక్సూచిగా మారింది. సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలతో ద్వితీయశ్రేణి నగరాలు ఐటీలో దూసుకెళ్తున్నాయి’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మడికొండలోని ఐటీ పార్కులో మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం ఘనంగా జరిగింది. మంత్రి మాట్లాడుతూ గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానంతో అన్ని అనుమతులను 15రోజుల్లో అందిస్తోందన్నారు.
మడికొండ, జూన్ 6 : పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తూ దేశానికి దిక్సూచిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఆలోచనలతో హైదరాబాద్తోపాటు ద్వితీయశ్రేణి నగరాలు ఐటీలో దూసుకుపోతున్నాయన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్కు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మడికొండలోని ఐటీ పార్కులో మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగ తి ఉత్సవం నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రితోపాటు స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, జడ్పీ చైర్మన్ సుధీర్బాబు, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, పరిశ్రమల శాఖ జీఎం హరిప్రసాద్ హాజరయ్యారు.
మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. తెలంగాణ ఏర్పడి 9 వసంతాలు పూర్తయినందున ఇప్పటివరకు సాధించిన విజయాలను చాటేందుకు 21 రోజుల పాటు అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో పారిశ్రామికంగా సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు పరిశ్రమలకు పవర్ హాలీడే ఇవ్వడంతో కొత్త పెట్టుబడులు లేక పరిశ్రమల్లో ఉత్పత్తులు తగ్గి కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. ప్రస్తు తం పరిశ్రమలకు 24గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, దీని వల్ల భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. వరంగల్లో మూతపడిన ఆజాంజాహి మిల్లు, ములుగు జిల్లా కమలాపూర్లోని రేయాన్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కేంద్రం చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు అమెరికా తర్వాత భారీ కంపెనీలను మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు.
పరిశ్రమల అనుమతుల కోసం గతంలో పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టి అన్ని అనుమతులు 15 రోజుల్లో అందిస్తున్నట్లు చెప్పారు. ఉత్పాదక, ఐటీ, లైఫ్సైన్స్, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో రూ.3.36లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిం చి 23లక్షల ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. 2014లో రూ.57వేల కోట్ల ఎగుమతులు, 3.23 లక్షల ఉద్యోగుల్లో ఉన్న ఐటీ పరిశ్రమ నేడు రూ.2.41లక్షల కోట్ల ఎగుమతులు, 9.05లక్షల ఉద్యోగాలకు ఎదిగి ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని వివరించారు. అనంతరం పారిశ్రామికవేత్తలను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్కుమార్, ఏడీ సురేశ్, టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ ఏడీ రాధికారెడ్డి, కార్పొరేటర్లు మునిగాల సరోజన, ఆవాల రాధికారెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, తూర్పా టి సులోచన, కేడీసీసీ జిల్లా డైరెక్టర్ కృష్ణప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ వీరారావు, గ్రానైట్ అసోసియేషన్ సభ్యులు చక్రధర్, ఐటీ కంపెనీల ప్రతినిధులు, టెక్కీలు పాల్గొన్నారు.