వరంగల్చౌరస్తా, జూన్ 1: క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ రిక్విసిషన్ ఫామ్పై రోగి, క్షతగాత్రుల పూర్తి వివరాలు నమోదు చేయాలని ఎంజీఎంహెచ్ ప్రథమస్థాయి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో) డాక్టర్ రఘునాథస్వామి ఆదేశించారు. దవాఖానలో అత్యవసర విభాగానికి వచ్చే ఎమ్మెల్సీ కేసుల్లో సైతం రోగి పూర్తి వివరాలు నమోదు చేయకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయమూ గత నెల 26న ‘ఇంత నిర్లక్ష్యమా?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి ఆదేశాలతో సోమవారం ఆర్ఎంవో అత్యవసర విభాగాన్ని సందర్శించి, వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు.
మెడికో లీగల్ కేసులకు సంబంధించి రిక్విసిషన్ ఫామ్ల్లో క్షతగాత్రుడి పూర్తి వివరాలు నమోదు చేస్తేనే కోర్టు విచారణకు అవసరమైన వైద్యసేవల సమాచారాన్ని అందించడానికి వీలు కలుగుతుందన్నారు. ఇకపై రిక్విసిషన్ ఫామ్లో స్వయంగా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు వివరాలు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. కాగా, ఆరు నెలలుగా నమోదైన మెడికో లీగల్ కేసు రిక్విసిషన్ ఫామ్ల్లో పూర్తి వివరాలు నమోదు చేయని రికార్డులను గుర్తించి, అధికారుల వారీగా వివరాలు వెల్లడించాలని ఎంఆర్డీ విభాగం అధికారులకు ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం.