వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 25 : కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం వైద్యశాలలో బాసిజాన్ని రూపుమాపేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. వైద్య విద్యార్థుల్లో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా రానివ్వకుండా చూడాలన్న భావనకు వచ్చారు. అనస్థీషియా విభాగం మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని స్వయంగా పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్ ప్రకటించిన విషయాన్ని ఎంజీఎం, కేఎంసీ వైద్యాధికారులు సీరియస్గా తీసుకున్నారు. సీనియర్లు, జూనియర్ల మధ్య ‘సర్’ అనే పదాన్ని దూరం చేసేందుకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
విద్యార్థులంతా సమానమేనని ఒకరిపై ఇంకొకరి పెత్తనాన్ని సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తూ ఎంజీఎంలో వైద్యసేవా విధానాన్ని అభ్యసిస్తున్నవారందరినీ ఒకేలా పరిగణించాలని అన్ని విభాగాల అధిపతులు, విద్యార్థులకు స్పష్టం చేశారు. గీతదాటే విద్యార్థులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ హెచ్చరించారు.
తీరనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత
ప్రస్తుతం ఎంజీఎంలో సుమారు 480 మంది పీజీ వైద్య విద్యార్థులున్నారు. వీరిని పర్యవేక్షించే అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గతంలోనే ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా 1100 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. కొద్ది రోజుల్లో ఎంజీఎం, కేఎంసీ అవసరాలకు తగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులోకి రానున్నారు. దీంతో విద్యార్థులపై నియంత్రణ పెరిగే అవకాశాలున్నాయి.
కొత్త బ్యాచ్లకు ‘ప్రేరణ’
ఏటా 160మంది విద్యార్థులతో ఏర్పాటయ్యే బ్యాచ్లను ప్రారంభించే ముందు ఎంజీఎం సూపరింటెండెంట్, కేఎంసీ ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో ఇండెక్షన్(ప్రేరణ) తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. వైద్యులు, తోటి వైద్యవిద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది, రోగులతో ప్రవర్తించాల్సిన తీరుపై వివరిస్తారు. వారి శారీరక, ఆరోగ్య, మానసిక స్థితిగతులను లాగ్బుక్లో నమోదు చేస్తారు. అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన, సున్నిత మనస్తత్వం కలిగిన ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతారు. లాగ్ బుక్ నిర్వహణ తప్పనిసరి చేయనున్నారు. విద్యార్థి తన వైద్య విద్యాభ్యాసం, దినసరి చర్యలు అందులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విధులపై నిర్లక్ష్య వైఖరిని తొలగించేందుకు లాగ్బుక్ నిర్వహణ దోహదపడనుంది.
విద్యార్థుల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తాం
విద్యార్థుల్లో భేదాభిప్రాయాలను తొలగించి, స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులంతా సమానమనే భావన ప్రతి ఒక్కరిలో కలిగించేలా చూస్తాం. రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రేరణ తరగతులు ఏర్పాటు చేసి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతాం. త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు పూర్తవుతాయి. దీంతో విద్యార్థులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంటుంది. అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
– డాక్టర్ మోహన్దాస్, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
హద్దుమీరితే చర్యలు తప్పవు
విద్యాబోధన విషయంలో విద్యార్థులతో ఎంత అన్యోన్యంగా ఉంటామో.. హద్దు మీరిన వారిపై అంతే కఠినంగా వ్యవహరిస్తాం. విధులను నిర్లక్ష్యం చేసినా, లాగ్ బుక్ నమోదులో అలసత్వం వహించినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా సంబంధిత విభాగాధిపతిని లేదా ఎంజీఎం, కేఎంసీ ఉన్నతాధికారులను కలిసి చెప్పే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఎవరు హద్దుమీరినా శాఖాపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్