తాడ్వాయి, జనవరి 9 : మేడారం పనుల్లో నిండా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. మహాజాతర సమీపిస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. అరకొరగా జరుగుతున్న పనుల్లోనూ నిబంధనలు పట్టించుకోవడం లేదు. భక్తులకు తాగునీటిని అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న చేతిపంపుల ఫ్లషింగ్ పనులు అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. జాతర పరిసరాల్లో సుమారు 400 బోర్బావులు ఉన్నాయి. విడిది చేసే భక్తులకు వీటి ద్వారానే తాగునీరు సరఫరా చేస్తారు. జాతర సమయంలో మాత్రమే వీటిని వినియోగించడంతో ప్రతిసారి ఫ్లషింగ్ పనులు చేస్తారు. అయితే అధికారులు దగ్గరుండీ పనులు చేయించాల్సి ఉన్నా.. వారు పట్టించుకోక పోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులు చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బోర్ పూర్తిగా ఫ్లషింగ్ కాకుంటే కలుషితమైన నీరు సరఫరా జరిగి భక్తులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కోటి మందికి పైగా వచ్చే జాతరలో తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా హడావుడిగా పనులు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మవార్లకు తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్ట షెడ్ల మరమ్మతులు ఇంకా మొదలు కాలేదు. గత జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా జంపన్నవాగు ఒడ్డున రెండు షెడ్లు నిర్మించారు. గతేడాది కురిసిన భారీ వర్షాల కు జంపన్నవాగు ఉప్పొంగి కొంగలమడుగు, జంట వంతెనల సమీపంలోని రెండు కల్యాణకట్టలు కూలిపోయాయి. అప్పటి నుంచి వీటిని దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మహాజాతర సమీపించినా పనులు మాత్రం ప్రారంభించలేదు. ప్రస్తుతం ఉన్న కల్యాణకట్టలు సరిపోవు. షెడ్లు మరమ్మతులకు మాత్రం అధికారులు నిధులు మంజూరు చేసి టెండర్లు నిర్వహించారు. అయినప్పటికీ కూలిపోయిన వాటి మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.