తల్లుల దర్శనం కోసం తనువంతా కనులు చేసుకొని ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు మేడారం వనంలో విడిది చేసి.. జంపన్న ఒడిలో ఓలలాడి, అమ్మల ధ్యాసలో లీనమై.. ‘మహా జాతర’లో మధురానుభూతులను మూటగట్టుకొని .. మదినిండా మేడారాన్ని నింపుకొని తిరుగుపయనమయ్యారు.
తరతరాల ఆచారాలను కొనసాగిస్తున్న ఆదివాసీలు.. సమ్మక్క-సారలమ్మను నమ్మి కొలుస్తున్న ఆదివాసీయేతరులు పిల్లా పాపలతో మేడారం బాట పట్టి.. వనదేవతలకు మనసారా మొక్కులు ముట్టజెప్పి.. ఇక్కడి చెట్టూపుట్టతో మమేకమై అణువణువులో అమ్మవార్లను చూసుకుంటూ తన్మయత్వంతో పులకించి పోయారు. ఇష్టదైవాలను కానుకలతో ప్రసన్నం చేసుకొని సకుటుంబ సపరివార సమేతంగా వంటావార్పులు చేసి, విందారగించి..
ఆటలాడి.. పాటలుపాడి.. ఎన్నో ఆనందాలను ఎదనిండా నింపుకొని మళ్లొచ్చే జాతరకు వస్తామంటు ఇంటిబాట పట్టారు. నేడు తల్లి సమ్మక్క- బిడ్డ సారక్క వనాలకు చేరనుండగా తిరుగువారం వరకు మరికొందరు తరలివచ్చి మేడారం ఇప్పుడే బెంగపెట్టుకోకుండా మైమరపిస్తారు.
మంగపేట : మేడారంలో భక్తుల రద్దీ పెరిగిపోయి జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన కోళ్లు, మేకల దుకాణాలన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో తల్లులకు కోళ్లు, మేకలు సమర్పించి మొక్కులు చెల్లించుకునే భక్తులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. కోళ్లు, మేకల కొరతతో వీటి ధర కూడా అమాంతం పెరిగిపోయింది. ఒక్కో కోడి రూ.400 నుంచి రూ.500 వరకు, చిన్నపాటి మేక పిల్లకు రూ.8 వేల ధర పలికింది. ఇక మటన్కు కిలో రూ.1200 వరకు పెట్టి కొనాల్సి వచ్చిందని భక్తులు తెలిపారు. ఇంత ధర పెట్టి కొందామన్నా జాతర ప్రాంగణంలో దొరకక తాడ్వాయి, కొత్తూరు, నార్లాపురం వరకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు.
కన్నాయిగూడెం : మేడారం సమ్మక్క- సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఎన్ని బాధలైనా ఓర్చుకుంటారు. శుక్రవారం ఓ మహిళా భక్తురాలు తన ఎత్తు బెల్లాన్ని నెత్తిన పెట్టుకొని తల్లులను దర్శనం చేసుకున్నది. బరువనిపించినా భరిస్తూ తన మొక్కును తీర్చుకున్నది.
ములుగు, నమస్తే తెలంగాణ : జాతరలో ఓ ట్రైనీ ఐపీఎస్ శుక్రవారం ఓవరాక్షన్ చేశాడు. మీడియా పాయింట్కు జర్నలిస్టులు వెళ్లకుండా అడ్డుకున్నాడు. ప్రతి జాతరప్పుడు గేట్ నుంచి పాస్లు ఉన్న జర్నలిస్టులను మీడియా పాయింట్కు పంపారు. కానీ ఈసారి ఆ గేట్ వద్ద డ్యూటీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ శుభం గేట్కు తాళం వేయించి పోలీసులను పెట్టాడు. చేతిలో కర్ర పట్టుకొని రెచ్చిపోయాడు. రెక్వెస్ట్ చేసినా వినిపించుకోలేదు. రెండు గంటల పాటు నిరీక్షణ, ఆందోళనతో వెనక్కి తగ్గాడు. మీడియా ఇన్చార్జి ఆఫీసర్, ఇన్స్పెక్టర్ పి.కిషన్ హుటాహుటిన చేరుకొని విషయాన్ని ములుగు ఎస్పీ శబరీశ్కు వాకీటాకీ సెట్లో తెలియజేశారు. స్పందించిన ఎస్పీ గేట్ తెరిచి పంపించండి అని ఆదేశించారు. దీంతో పోలీసులు గేట్ తాళం తీసి జర్నలిస్టులను మీడియా పాయింట్కు పంపారు.
ఏటూరునాగారం: మేడారం జాతర పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. కోళ్లు, మేకల వ్యర్థాలు, భక్తులు వాడిన నీళ్లు, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. రెడ్డిగూడెం, నార్లాపూర్, స్తూపం, ఊరట్టం, వీవీఐపీ, వీఐపీ పార్కింగ్ ప్రదేశాలు, మేడారం పరిసరాల్లో కంపు వాసన వస్తోంది. భరించలేక భక్తులు ముక్కు మూసుకోవాల్సి వచ్చింది. మేడారంలోని ప్రధాన వైద్యశాల మెట్ల వద్ద వాడకం నీళ్లు చేరి రోగులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కోళ్లు, మేకల వ్యర్థాలు కుళ్లిపోయి వాసన వస్తోంది. అనేక చోట్ల భక్తులు మలమూత్ర విసర్జన చేయడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.
ఏటూరునాగారం : మేడారంలో తాగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తల్లుల ప్రవేశ ద్వారం-1 వద్ద ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏర్పాటు చేసిన తాగునీటి సెంటర్ వద్ద డ్రమ్ముల్లో నీరు అపరిశుభ్రంగా ఉంది. క్యూలైన్లో నిల్చున్న భక్తులకు కనీసం నీరు అందించేవారు లేరు. డ్రమ్ముల్లో దుమ్ము, చెత్త పడకుండా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఆ నీరు తాగడమేమో గానీ రోగాలు రావడం మాత్రం ఖాయమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్ల వద్దే ఇలా ఉంటే జాతర పరిసరాల్లో పరిస్థితి ఏమిటని భక్తులు వాపోతున్నారు.
ఏటూరునాగారం : మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ప్రధాన గేటు సమీపంలో జీసీసీ ఆధ్వర్యంలో విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. గిరిజనులకు వివిధ రకాల వస్తువులు అందజేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు బ్రాంచ్ మేనేజర్ దేవ్ తెలిపారు. కొబ్బరి, బెల్లం, తేనె, ఇతర కిరాణ సామగ్రి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారమే లక్ష్యంగా కాకుండా గిరిజనులకు సేవ చేయడంలో భాగంగా జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తున్నామని, మరో రెండు రోజుల పాటు కేంద్రం ఉంటుందని దేవ్ తెలిపారు.
ఏటూరునాగారం : మేడారంలోని ప్రధాన వైద్యశాలను హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. కేంద్రం ఆవరణలో కరపత్రాలను ఆవిష్కరించారు. భక్తులు పెరుగుతున్నందున సేవలను మరింత పెంచాలని డీఎంహెచ్వో అప్పయ్యను ఆదేశించారు. కరపత్రాల ఆవిష్కరణలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంగపేట : మేడారం జాతరలో మూడు రోజులుగా జరిగిన ఆదివాసీ గిరిజన ఇలవేల్పుల సమ్మేళన పూజలు శుక్రవారం ముగిశాయి. సమ్మక్క-సారలమ్మ మ్యూజియం వెనక ప్రతిష్ఠించిన ఇలవేల్పుల(కుల దైవాలు)కు కులపెద్దలు, పూజారులు సంప్రదాయ పూజలు చేశారు. వివిధ గోట్లకు చెందిన రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల గిరిజనులు తమ కుల దైవాలైన ఇలవేల్పులతో డోలు వాయిద్యాల నడుమ నృత్యం చేశారు. అనంతరం తమ ఆచారం ప్రకారం మద్యం ఆరబోసి, ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టారు. గుగ్గిలంతో ధూపం వేసి, కోళ్లను సమర్పించి మొక్కులు అప్పజెప్పారు. దీంతో ఆదివాసీల ఇలవేల్పుల సమ్మేళన పూజలు ముగిసినట్లు సమ్మేళన కో ఆర్టినేటర్ కొమరం ప్రభాకర్ తెలిపారు.
మంగపేట : మేడారంలో గిరిజన మ్యూజియం ఆవరణలో మట్టి గోడలు, పైకప్పుగా గుట్టగడ్డితో విలేజ్ హట్స్ను ప్రదర్శన కోసం నిర్మించారు. సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం శుక్రవారం గంటల తరబడి క్యూలో ఉండి అలసిపోయిన భక్తులు విలేజ్ హట్స్కు చేరుకొని లోపల చల్లగా ఉండడంతో సేద తీరుతున్నారు.
మంగపేట: భక్తుల రద్దీ పెరగడంతో శుక్రవారం సమ్మక్క – సారలమ్మ గద్దెల పరిసరాల్లో రోడ్లపై దుకాణాలను తొలగించాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ఆలం వ్యాపారులను ఆదేశించారు. గద్దెల నుంచి చిలుకలగుట్ట, జంపన్నవాగు, బస్టాండ్కు వెళ్లే రోడ్లపై ఇరువైపులా ఏర్పాటు చేసిన కొబ్బరికాయలు, పూజా సామగ్రి, ఇతర దుకాణదారులతో మాట్లాడారు. 108 వంటి అత్యవసర సేవలకు, ప్రజాప్రతినిధులు రావడంతో కొద్దిసేపు దర్శనాలు నిలిపి వేస్తుండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వ్యాపారులు నిర్లక్ష్యం వహించడంతో ఎస్పీ వారిపై ఆగ్రహించారు.
తాడ్వాయి : భక్తులను తిరుగు ప్రయాణంలో గమ్యం చేర్చేందుకు బస్సులు పెద్ద సంఖ్యలో రావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. మేడారం బస్టాండ్లో శుక్రవారం రాత్రి బస్సులు వేల సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో మేడారం నుంచి తాడ్వాయి వరకు బస్సులు వెళ్లడానికి కనీసం మూడు గంటల సమయం పట్టింది.
మంగపేట : వనదేవతలు గద్దెలపై కొలువుదీరడంతో భక్తజనంతో మేడారం పోటెత్తింది. దీంతో బస్టాండ్ ప్రాంతం కిక్కిరిసింది. జాతరకు వచ్చే భక్తులు, దర్శనం చేసుకొని తిరిగి వెళ్లే వారితో మేడారం బస్టాండ్, సమీప ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. దర్శనం ముగించుకొని బస్టాండ్కు చేరుకున్న భక్తులు చాలామంది ప్రయాణ ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. దీని వల్ల అక్కడ రద్దీగా పెరగడంతో బస్టాండ్కు వచ్చిన భక్తులు తమ తమత ప్రాంతాలకు వెళ్లాలని మైక్లో సూచిస్తున్నారు. ఆర్టీసీ, పోలీసు సిబ్బంది భక్తులను క్యూలైన్ల ద్వారా వారు వెళ్లే బస్సుల్లోకి పంపిస్తున్నారు. ఇందుకోసం వందలాది మంది ఆర్టీసీ సిబ్బందికి తోడు గా, ఓ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో నలుగురు డీఎస్పీలు, 56 మంది ప్రొబేషనరీ ఎస్సైలు, పలువురు పోలీసు సిబ్బంది, హోంగార్డులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఖాళీ అవుతున్న మేడారం
ఏటూరునాగారం : మూడు రోజుల పాటు మేడారంలో విడిది చేసిన భక్తులు శుక్రవారం ఉదయం నుంచి తిరుగు పయనమయ్యారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలపై కొలువుదీరిన తర్వాత మొక్కులు చెల్లించుకున్న లక్షలాది మంది ఇంటిబాట పడుతున్నారు. మూట, ముల్లె సర్దుకుని వెళ్లిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కొందరు, ట్రాక్టర్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో మరికొందరు భక్తులు బయల్దేరుతుండడంతో క్రమంగా గుడారాలు ఖాళీ అవుతున్నాయి. పలువురు చిరు వ్యాపారులు కూడా సామాన్లు సర్దుకుంటున్నారు. జంపన్నవాగు, రెడ్డిగూడెం, కొంగల మడుగు, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్, ఎలుబాక పరిసరాలు భక్తుల్లేక వెలవెలబోతున్నాయి. బస్టాండ్కు వెళ్లే భక్తుల నుంచి ఆటోవాలాలు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. మొత్తానికి గత నెల రోజుల నుంచి మేడారానికి భక్తుల రాక మొదలుకాగా శుక్రవారం నుంచి ఖాళీ అవుతుండడంతో జాతర పరిసరాలు కాస్త బోసిపోయి కనిపించాయి.
వాజేడు : శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి మేడారానికి వచ్చిన సమయంలో గంటల తరబడి సామాన్య భక్తులకు దర్శనం నిలిపివేశారు. దీంతో క్యూలో ఉన్న చంటిపిల్లలు, వారి తల్లులు అవస్థలు పడ్డారు. పిల్లలకు కనీసం పాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేక, బయటకు వెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులు కనికరించక తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఒక దశలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు.