మేడారం మహాజాతర సమీపిస్తున్నది. మరో నెల రోజుల్లో సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానున్నది. నెల రోజులు ముందుగానే పూర్తి కావాల్సిన అభివృద్ధి పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ఆరు ప్రధాన శాఖల ద్వారా రూ.51.56కోట్లతో చేపట్టిన 209 అభివృద్ధి పనుల్లో ఇప్పటివరకు 20శాతం కూడా పూర్తి కాలేదు. ఈ నెల 17న మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉన్నతస్థాయి సమీక్షించి 31వరకు గడువు విధించినప్పటికీ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పర్యవేక్షిస్తున్న అధికారులతో పాటు కాంట్రాక్టర్ల వద్ద జవాబుదారీతనం కొరవడినట్లు కనిపిస్తున్నది. మరి జాతరలోగా ఈ పనులన్నీ చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే హడావుడి చేసి.. మమ అనిపిస్తారా అనే సందేహం కలుగుతోంది.
మేడారంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులు మహాజాతర నాటికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. నెల రోజుల క్రితం నుంచే ముందస్తు మొక్కుల చెల్లింపులో భాగంగా మేడారానికి భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి కాక వారు ఇబ్బందులు పడుతున్నారు. అమ్మవార్ల జాతరకు నెల రోజుల ముందుగానే పనులు పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం రూ.75 కోట్ల నిధులను విడుదల చేయగా, ఆరు ప్రధాన శాఖల ద్వారా రూ.51కోట్ల 56లక్షల 70వేలను వివిధ ప్రదేశాల్లో 209 అభివృద్ధి పనులను అధికారులు చేపట్టారు. ఇందులో 81 టెండర్, 128 పనులను నామినేటెడ్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. చేపట్టిన వాటిలో ఇప్పటివరకు 20శాతం కూడా పూర్తి కాకపోవడంతో ఈ నెల 17న రాష్ట్ర మంత్రులు సీతక్క, సురేఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు ఈ నెల 31వ తేదీ వరకు పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ పనులు జాతరకు వారం రోజుల ముందుగా కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఆరు శాఖల ద్వారా చేపట్టిన పనులు కొనసాగుతున్నాయి. సివిల్ పనులు పోను మిగిలిన రూ.23.43కోట్లను ములుగు జిల్లాలోని ఇతర అభివృద్ధి పనులకు వినియోగించడంతో పాటు పోలీస్, ఇతర శాఖలకు కేటాయించారు. రోడ్డు, భవనాల శాఖ ద్వారా రూ.4.16 కోట్లతో 14 రోడ్ల మరమ్మతు పనులను చేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఇరిగేషన్ శాఖ ద్వారా జంపన్నవాగులో తొమ్మిది పనులకు టెండర్లు నిర్వహించి రూ.61.10లక్షలతో చేస్తుండగా, ఏ ఒక్క ప్రాంతంలోనూ పూర్తి కాలేదు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా మొత్తం 53 పనులను రూ.5.81కోట్లతో చేస్తుండగా ఇందులో 17 టెండర్లు, 36 పనులను నామినేటెడ్ పద్ధతిన కేటాయించారు. ఇవి నత్తనడకన సాగుతున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా రూ.13.45కోట్లతో 73 ప్రాంతాల్లో పనులు చేస్తుండగా, ఇందులో 31 టెండర్, 42 నామినేటెడ్ పద్ధతిన జరిపిస్తున్నారు. పీఆర్ శాఖ ద్వారా రూ.10.67కోట్లతో పనులు చేపట్టగా, ఇందులో 10 టెండర్, 44 నామినేటెడ్ పద్ధతిన చేపట్టారు. ఈ రెండు శాఖల్లో 10శాతం కూడా పూర్తి కాలేదు. అలాగే విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రూ.11.36కోట్లతో చేపట్టగా టెండర్ ద్వారా పొందిన ఒకే ఒక్క కాంట్రాక్టర్ నెమ్మదిగా పనులు చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు ముందస్తుగానే చేపట్టడంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో వచ్చే నెల 8వరకు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
మహాజాతర అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు సిండికేట్గా మారి బయటి వ్యక్తులకు దక్కకుండా లోపాయికారి ఒప్పందం చేసుకొంటారని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. గత నాలుగైదు జాతరల్లో పనులు చేసిన కాంట్రాక్టరే ఈసారి కూడా ఎక్కువ మొత్తంలో పనులు పొందారు. అధికారులు, ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి పనులను చేపడుతున్నారు. ఇదే విషయమై సమీక్షలో మంత్రులు అధికారులను నిలదీయగా కాంట్రాక్టర్లు లెస్కు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నారని తెలిపారు. దీంతో మంత్రులు సదరు కాంట్రాక్టర్లపై ప్రత్యేక దృష్టిసారించి క్వాలిటీ కంట్రోల్తో తనిఖీ చేయించిన తర్వాతే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. నాణ్యత పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టి మరోసారి టెండర్లలో పాల్గొనకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు వంత పాడుతూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసేలా విధులు నిర్వర్తించే అధికారులపై కూడా కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు.