తాడ్వాయి, జనవరి 31 : ఆదివాసీ దైవాలు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. మహా జాతరకు మరో 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. దీంతో గద్దెలు, మేడారం పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించి గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించారు. గద్దెల పరిసరాలతో పాటు చిలకలగుట్ట, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో విడిది చేశారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు.
గద్దెల ప్రాంగణంలో కొబ్బరి కాయలు కొట్టేందుకు స్టాండ్లు ఏర్పాటు చేయకపోవడంతో నీటితో చిత్తడిగా మారుతోంది. బెల్లం, ఒడిబియ్యంతో పాటు కొబ్బరి నీళ్లు గద్దెల వద్ద పారుతుండటంతో మిశ్రమంగా మారి భక్తుల కాళ్లకు అంటుకుని జాతర పరిసరాలు మొత్తం వ్యాపిస్తున్నది. దీంతో ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. అయినా దేవాదాయశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.