మోదీ సర్కారు రాష్ట్రానికి నిధులివ్వకుండా మోకాలడ్డుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలోని శ్యామల గార్డెన్లో ఆదివారం గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదని వెల్లడించారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోందని మండిపడ్డారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.
ఖిలావరంగల్, మార్చి 26: సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్న రాష్ట్ర సర్కార్.. విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి యూనిఫాం అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రభు త్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి పిల్లలే విద్యనభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం పంపిణీ చేస్తున్నది. ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్ర్తాలను అందించాలని ప్రభుత్వం సంకల్పించి రూ. 121 కోట్లు కేటాయించింది. ఈ మేరకు వస్త్రంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే, ఈసారి ఒక్కో విద్యార్థికి ఒకేసారి రెండు జతల దుస్తులు అందించేందుకు చర్యలు చేపట్టింది. పంపిణీలో ఆలస్యం జరుగకుండా వేసవిలోనే యూనిఫాం కుట్టించి పాఠశాలలకు అందజేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు జిల్లాలకు వస్ర్తాలను తరలించింది.
విద్యార్థుల తల్లిదండ్రుల సూచన మేరకు ఈ ఏడాది మన్నిక కలిగిన దుస్తులను అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకోసం విద్యాశాఖ 2,27,476. 50 మీటర్ల వస్ర్తాన్ని జిల్లాకు కేటాయించింది. ఈ నెల 29న వస్త్రం జిల్లాకేంద్రానికి చేరుకునే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. వస్త్రం వచ్చిన తర్వాత యూనిఫాం కుట్టే బాధ్యతను ఏజెన్సీలకు అప్పగిస్తారు. వేసవిలోనే యూని ఫాం సిద్ధం చేసి, జూన్ నెలలో పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఒక్కో విద్యార్థికి రెండు జతలు అందజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అన్ని చర్యలను ముమ్మరం చేసింది.
జిల్లాలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ రెండు జతల చొప్పున యూనిఫాం అందజేయనున్నారు. ప్రభుత్వ ప్రాథమిక, మండల, జిల్లా పరిషత్, కేజీబీవీలు, అర్బన్ రెసిరెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఒకే విధంగా ఉన్న యూనిఫాంను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 43,948 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అందించాలని, ఎక్కడైనా అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.