జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం పెరుగడంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వేసవిలో పంటలకు నీరందించేందుకు రైతులు ఎక్కువగా కరంటు బోర్లను వినియోగిస్తారు. ఈ మోటర్లకు ఆటోస్టార్టర్లను బిగించడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లపై అదనపు భారం పడి కాలిపోతున్నాయి. దీన్ని నివారించేందుకు విద్యుత్ శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ముందు జాగ్రత్తగా వ్యవసాయ మోటర్ల స్టార్టర్లను తొలగిస్తున్నారు. వీటి స్థానంలో కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. స్టార్టర్ల ఏర్పాటుతో మోటర్లు ఒకేసారి ఆన్ కావడం వల్ల లోవోల్టేజీతో కాలిపోయే ప్రమాదముందని వివరిస్తున్నారు.
వర్ధన్నపేట, మార్చి 11 : వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి, ఇతర పంటలను సాగు చేశారు. ఎండలు తీవ్రం అవుతుండడంతో పంటలకు నీటి అవసరం పెరిగింది. దీంతో రైతులు విద్యుత్ మోటర్లకు ఆటోమెటిక్ స్టార్టర్లను ఏర్పాటు చేసుకొని పంటలకు నీటిని అందిస్తున్నారు. అంతేకాక గృహావసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో ప్రజలు, రైతులకు మెరుగైన కరంటు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా రైతులు వ్యవసాయ మోటర్లకు ఆటోస్టార్టర్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల అన్ని మోటర్లు ఒక్కసారి ఆన్ కావడంతో ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లపై అదనపు భారం పడి కాలిపోతున్నాయి. సిబ్బంది మరమ్మతులు చేసి తిరిగి సరఫరా పునరుద్ధరించే వరకు ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆటో స్టార్టర్లను తొలగిస్తున్న సిబ్బంది..
విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తూ ఆటో స్టార్టర్లను తొలగిస్తున్నారు. ఆటోస్టార్టర్ల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలు కూడా ఎండిపోయే ప్రమాదముందని వివరిస్తున్నారు. భూగర్భ జలాలు పెరగడం వల్ల రైతులు 24 గంటలు విద్యుత్ మోటర్లను నడిపించుకుంటున్నారు. దీంతో నీటి వృథా ఎక్కువవుతున్నది. క్రమ పద్ధతిలో మోటర్లను నడిపితే విద్యుత్ ఆదా కావడంతో పాటు నీటి వృథాను అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆటో స్టార్టర్ల వినియోగంతో సబ్స్టేషన్లలో వోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతుందని రైతులకు వివరిస్తున్నారు.
2.04లక్షల ఎకరాల్లో పంటలు..
జిల్లాలో రైతులు వ్యవసాయ బావులు, బోర్లు, చెరువుల ద్వారా సాగునీటిని వినియోగించుకుంటున్నారు. వ్యవసాయ బావుల ద్వారా 1,13,867 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. 58,370 ఎకరాల సాగుకు బోరు బావులపై ఆధారపడుతున్నారు. చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ బావులు, బోర్ల కింద కూడా రైతులు వరి, మక్కజొన్న, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. యాసంగిలో 2లక్షల 4వేల 986 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. నీరు ఎక్కువగా అవసరం ఉండే వరి 1,07,226 ఎకరాలు, మక్కజొన్న 86,748 ఎకరాల్లో సాగవుతున్నది.
కెపాసిటర్లపై అవగాహన..
ఆటోమెటిక్ స్టార్టర్ల స్థానంలో కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తున్నది. సాధారణంగా 470 వోల్టోజీ ఉంటేనే మోటరు నడుస్తుంది. కానీ కెపాసిటర్లు అమర్చితే 370 వోల్టోజీ ఉన్నా మోటరు నడిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ కూడా ఆదా అవుతుంది. రూ.400 విలువైన కెపాసిటర్లను అమర్చుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరాకు సహకరించాలని వారు కోరుతున్నారు.
స్వచ్ఛందంగా తొలగించుకోవాలి..
– సీహెచ్ ప్రశాంత్, ఏడీఈ, విద్యుత్ శాఖ
విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఆటో స్టార్టర్లను రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. వీటి వల్ల డీపీఆర్లపై అధిక భారం పడడంతో పాటు మోటర్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతారు. నిరంతరం మోటర్లు నడవడం వల్ల విద్యుత్, నీటి వృథా జరుగుతోంది. స్టార్టర్ల స్థానంలో రైతులు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి. లోడు కూడా సమపాళ్లలో ఉండడం వల్ల మోటర్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి. ఆటో స్టార్టర్లను తొలగిస్తున్న సిబ్బందికి రైతులు సహకరించాలి.