వరంగల్, నవంబర్ 3: వరంగల్ మహా నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆమె ప్రజారోగ్యం, అర్బన్ హెల్త్ విభాగం అధికారులతో సమీక్షించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ, ఇంటింటికీ చెత్త సేకరణపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారోగ్యం, అర్బన్ హెల్త్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి జవాన్లు, కార్మికులు పని చేసేలా చూడాలన్నారు.
గ్రేటర్ కార్పొరేషన్లోని ఇద్దరు ఎంహెచ్వోలు సమర్థవంతంగా పారిశుధ్య పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకండా దోమల నివారణకు ప్రణాళికాబద్ధంగా ప్రతి డివిజన్లో ఫాగింగ్ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేయాలన్నారు. ఎంఎల్ అయిల్ బాల్స్, టీమోపాస్ రసాయనాలను స్ప్రే చేయాలన్నారు. మహానగరంలో ప్లాస్టిక్ నియంత్రణ జరిగేలా చర్యలు చేపట్టాన్నారు. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. నగరంలో నిషేధిత ప్లాస్టిక్ విక్రయదారులు, వినియోగదారులపై నిఘా పెట్టాలన్నారు. నిరంతరం తనిఖీలు చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ కమిషనర్ అనీసుర్ రషీద్, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, బయాలాజిస్ట్ మాధవరెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు, మాదాసి సాంబయ్య, భాస్కర్, హెల్త్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
బల్దియా కార్యాలయంలో మేయర్ తనిఖీ
జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయాన్ని మేయర్ సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాల చాంబర్లను తనిఖీ చేశారు. జాబ్ చార్ట్ను అడిగి తెలసుకున్నారు. ఇంజినీరింగ్, అకౌంట్స్, కంప్యూటర్ సాధారణ పరిపాలన విభాగాలను పరిశీలించారు. ఇన్వార్డుకు వెళ్లిన మేయర్ రికార్డులను పరిశీలించారు. సహాయక కేంద్రానికి వస్తున్న ఫోన్కాల్స్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ఆమె వెంట సూపరిటెండెంట్ ఆనంద్కుమార్, ఐటీ మేనేజర్ రమేశ్ ఉన్నారు.