వరంగల్, మార్చి 10: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. ఈ మేరకు ఆమె మూడు పేజీలతో కూడిన లేఖను శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి పంపించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అనేక ఏళ్లుగా కోల్డ్ స్టోరేజ్లో మాదిరిగా నానుతూ వస్తున్నదని, ఎన్నికల సమయంలో జాతీయ పార్టీలు హామీలు ఇస్తూ తర్వాత తుంగలో తొక్కడం పరిపాటిగా మారిందని లేఖలో పేర్కొన్నారు. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇంతటి కీలక అంశంపై ఒక్క అడుగు ముందుకు వేయలేదని ప్రశ్నించారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపారు. స్థానిక సంస్థల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని చట్టం ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 50 శాతం పదవులు దక్కేలా రిజర్వేషన్ను తప్పనిసరి చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్పై సానుకూల ప్రతిస్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.