గిరిజనుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. ములుగులో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పదేళ్ల నాటి విభజన హామీని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 7న గిరిజన యూనివర్సిటీ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. రూ.889.07 కోట్లతో ఏర్పాటయ్యే యూనివర్సిటీ ములుగు జిల్లాకు తలమానికంలా నిలువనుంది. బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు చేసిన విశేష కృషికి ఫలితంగా గిరిజనులకు ఉన్నత విద్య దరిచేరబోతున్నది.
Tribal University | ములుగు, డిసెంబర్ 8 (నమస్తేతెలంగాణ) : గిరిజనులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కాన్నుది. ములుగు కేంద్రంగా ఏర్పాటయ్యే యూనివర్సిటీ రాష్ర్టానికే తలమానికం కానుంది. ఉమ్మడి రాష్ట్రం విభజన చట్టమైన సెక్షన్ 93 షెడ్యూల్13(3) ప్రకారం తెలంగాణకు వచ్చిన గిరిజన యూనివర్సిటీ అన్ని విధాలా సౌలభ్యంగా, సౌకర్యంగా ఉన్న ములుగు ప్రాంతంలో ఆవిష్కృతం కానున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఢిల్లీలో ప్రధాన మంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసి ఎన్నో సార్లు యూనివర్సిటీ ఏర్పాటుపై విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ 2018 డిసెంబర్ 31న యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేటాయించిన భూములను పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడంతో పాటు యూనివర్సిటీ ఏర్పాటుకు, తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం ములుగు మండలం జాకారంలోని వైటీసీ భవనాన్ని సైతం కేటాయించింది.
భూములను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన అనంతరం ప్రధాని మోదీ ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బహిరంగసభలో ములుగు జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యూనివర్సిటీని మేడారం సమ్మక్క సారలమ్మ పేర్లతో నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం ఈ నెల 4న లోక్సభలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగా ఈ నెల 7న మూజువానీ ఓటుతో ఆమోదించింది. లోక్సభలో ఆమోదించిన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. ములుగులో రూ.889.07 కోట్లతో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి లోక్సభలో వెల్లడించారు.
మహబూబాబాద్ రూరల్ : ములుగులో సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటకు లోక్సభ ఆమోదం తెలుపడం హర్షించదగిన విషయం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ పోరాటాట వల్లే ములుగులో యూనివర్సిటీ ఏర్పాటవుతున్నది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాజీ సీఎం కేసీఆర్ ఎన్నోమార్లు యూనివర్సిటీపై విన్నవించారు. విభజన చట్టంలోనే ఉన్నా కేంద్ర ప్రభుత్వం పదేండ్లు కాలయాపన చేసింది. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు కేసీఆర్ హయాంలోనే అన్ని విధాలా అభివృద్ధి చెందింది. గిరిజన విశ్వ విద్యాలయం ఈ ప్రాంత వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల విద్యార్థులకు వరంలా మారనుంది.
మానుకోట పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లాలో గిరిజన యూనివరర్సిటీ ఏర్పాటుకు లోక్సభ ఆమోదం లభించడం సంతోషంగా ఉంది. యూనివర్సిటీలో ఈ ప్రాంత గిరిజన విద్యార్థులకు ఎంతో ప్రజయోజనం కలుగుతుంది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో కేంద్రానికి బీఆర్ఎస్ ఎంపీలు అనేక మార్లు విన్నవించడం వల్లే ఇప్పుడు కల సాకారమవుతున్నది. యూనివర్సిటీ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా ఈ ప్రాంతవాసులను కేంద్ర ప్రభుత్వం కాలయాపనతో ఇబ్బంది పెట్టింది. ఇప్పటికైనా ఈ ప్రాంత వాసుల కోరిక నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఏజెన్సీ ప్రాంతమైన ములుగు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ కొత్త జిల్లాగా రూపాంతరం చెందింది. ఇప్పుడు దేశంలోనే అతిపెద గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుండడంతో ములుగుకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. మధ్యప్రదేశ్లోని అమర్టంక్ జిల్లాలో మొదటి గిరిజన యూనివర్సిటీని రూ.1100కోట్లతో నెలకొల్పారు. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైంది. అంతకు మించిన వ్యయంతో మూడో యూనివర్సిటీ ములుగులో ఏర్పాటు కానుంది. గట్టమ్మ ఆలయం పరిసరాల్లో 163 జాతీయ రహదారికి ఆనుకొని యూనివర్సిటీ ఏర్పాటు కానుండడంతో రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, సిబ్బంది వరంగల్ రైల్వే స్టేషన్కు వచ్చి గంటలో ములుగుకు చేరుకోవచ్చు.
యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ 335.04 ఎకరాల భూమిని కేటాయించింది. తొలుత కేంద్రం మొత్తం 500 ఎకరాలు అవసరముందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించగా రెవెన్యూ, ఫారెస్ట్ శాఖకు సంబంధించి 487ఎకరాల 4గుంటల భూమిని గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం రెవెన్యూకు సంబంధించిన సర్వే నంబర్ 837లోని 274 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు, సిబ్బందితో సర్వే చేయించి 120 ఎకరాల భూమిని అప్పగించారు. జీపీఎస్ సర్వే సైతం చేయించారు. మిగిలిన అటవీశాఖ భూమిని బదలాయింపులో భాగంగా అప్పగించాలని ఫారెస్ట్ట్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారు సుముఖత వ్యక్తం చేసి సర్వే చేపట్టి భూమిని రెవెన్యూ శాఖకు బదలాయించారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31న కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆర్. సుబ్రహ్మణ్యం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉప కులపతి అప్పారావు, సెంట్రల్ పబ్లిక్వర్సిటీ సీఈ సాంబశివరావు బృందం జిల్లాలో పర్యటించి కేటాయించిన భూములను పరిశీలించి అనువైనవేనని కేంద్రానికి నివేదిక సమర్పించారు. ప్రస్తుతానికి ఫారెస్ట్, రెవెన్యూ శాఖలకు సంబంధించి 335.04ఎకరాల ప్రభుత్వ భూమిని సిద్ధం చేసి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు అప్పగించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గత రెండు బడ్జెట్లలో ఇప్పటి వరకు రూ.19కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు పాత్ర పోషించి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సదరు స్థలానికి శాశ్వత ప్రాతిపదికన హద్దు రాళ్లు వేసింది.