ఖిలావరంగల్, జనవరి 20 : పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి హంటర్ రోడ్డులోని సంతోషిమాత ఆలయం సమీపంలో పట్టాలు దాటుతున్నాడు.
ఈ క్రమంలో వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు వరంగల్ రైల్వే పోలీసు స్టేషన్లో లేదా ఎంజీఎం దవాఖానలో సంప్రదించాలని పోలీసులు కోరారు.