హనుమకొండ చౌరస్తా, జనవరి 18 : వరంగల్ నిట్లో ఈ నెల 19 నుంచి 21 వరకు టెక్నోజియాన్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఇందులో వివిధ రాష్ర్టాలకు చెందిన సుమారు 15 వేల మంది నిట్ ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొననున్నట్లు చెప్పారు. గురువారం నిట్ సెనేట్ హాల్లో ఆయన మాట్లాడుతూ.. 2006లో ప్రారంభమైనన టెక్నోజియాన్ యువతకు సాంకేతిక అభివృద్ధిని అందించడంలో ముందుందన్నారు. ఈ సంవత్సరం టెక్నోజియాన్ థీమ్ ఇంజీనియస్ అని, ఇది ఇన్నోవేషన్ను సూచిస్తుందన్నారు. ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ శ్రీనివాసన్ సుందరరాజన్ హాజరవుతున్నట్లు చెప్పారు. బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్ క్షిపణి వ్యవస్థల రూపకల్పన, ఉత్పత్తి, అభివృద్ధిలో ఆయనది ముఖ్య పాత్ర అని, నిట్ డైరెక్టర్గా పనిచేశారని తెలిపారు. ప్రకాశ్ సంగం(సీఈవో, రెడ్బస్), డాక్టర్ టీఎన్ సురేశ్కుమార్(సైంటిస్ట్, ఇస్రో), వంశీ కూరపాటి (ఇన్ఫ్లూయన్సర్) తదితర ముఖ్యవక్తలు ఉపన్యసిస్తారని చెప్పారు.
జహాజ్, ఆర్సీ బగ్గీ, హోవర్మానియా, వర్చువల్ రియాల్టీ, డీబగ్గింగ్ మానియా వంటి స్పాట్లైట్ ఈవెంట్లు నిర్వహిస్తామన్నారు. రెండు రోజుల్లో మెటాల్యాబ్, టీ-వర్క్స్ ద్వారా ర్యాపిడ్ ప్రొటోటైపింగ్, సిమ్యూలింక్ మాస్టర్, ఇన్నోసెర్చ్పై వర్షాప్లు ఉంటాయన్నారు. టెక్నోజియాన్లో సుమారు 40 టెక్నికల్ ఈవెంట్లను నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన స్పర్థక్ బృంద వాహన ప్రదర్శన ఉంటుందన్నారు. నిట్ స్టూడెంట్ సెక్రటరీ, ఈవెంట్ ఆర్గనైజర్లుగా చందర్, ప్రశాంత్కుమార్, పామర్తి సాహిత్, నజీర్ తనీష్ వ్యవహరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య, టెక్నోజియాన్ ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ హరిప్రసాద్రెడ్డి, స్టూడెంట్స్ ఆక్టివిటీ సెంటర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ హరికృష్ణ, ప్రొఫెసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.