సెలవు వచ్చిందంటే చాలు పొలాల్లో దిగి నాట్లేస్తుంది.. చేన్లలో పడి పత్తేరుతూ.. మిరప కాయలు తెంపుతూ దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో ‘బాబాయ్, తమ్ముడూ’ అంటూ వరసలు కలిపి సెల్ఫీలు దిగుతుంది.. ట్రస్ట్ పేరిట అనాథ పిల్లలకు దుస్తుల పంపిణీ.. బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ అంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది.. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే.. మరోవైపు సేవ ముసుగులో ఆమె ఎత్తిన ‘లంచావతారాన్ని’ అవినీతి నిరోధక శాఖ శుక్రవారం బట్టబయలు చేసింది. మోస్ట్ పాపులర్.. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపింది.
మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ శుక్రవారం ఏసీబీ వలకు చిక్కింది. ‘సేవ’ ముసుగులో ఆమె సాగిస్తున్న అవినీతి బాగోతం బట్టబయలైంది. తస్లీమాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ములుగు జిల్లా సబ్ రిజిస్టార్గా 12 ఏళ్లపాటు అకడే విధులు నిర్వర్తించింది. గతేడాది బదిలీల్లో భాగంగా మహబూబాబాద్కు వచ్చింది. సెలవు రోజుల్లో నాట్లు వేయడం, పత్తి ఏరడం, మిర్చి తెంపడం వంటి కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం పొందింది. కార్యాలయానికి ఆటో, బస్సు, ద్విచక్ర వాహనాలపై వస్తూ విసృ్తత ప్రచారం చేసుకునేది.. ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు దుస్తుల పంపిణీ, ఎవరైనా మరణిస్తే వారి ఇంటికి వెళ్లి 25 కిలోల బియ్యం బస్తా, కొంత నగదు ఇచ్చి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులతోనూ సెల్ఫీలు దిగుతూ వరుసలు కలిపేస్తుంది. ఇలా ఆమె ప్రజల్లో ప్రాచుర్యం పొందింది.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుడగాని హరీశ్, తన 128 గజాల స్థలానికి రిజిస్ట్రేషన్ కోసం మార్చి మొదటి వారంలో రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. సబ్ రిజిస్ట్రార్ను కలిసి రిజిస్ట్రేషన్ వివరాలు తెలిపాడు. వెంటనే సబ్ రిజిస్ట్రార్ తస్లీమ్ మహ్మద్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకటేశ్ను కలవాలని సూచించింది. దీంతో హరీశ్, వెంకటేశ్ను కలిశాడు. ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూ.100 ఉంటుందని గానీ ఇక్కడ మాత్రం గజానికి రూ.200 చొప్పున ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందని వెంకటేశ్ చెప్పాడు. దీంతో హరీశ్ మళ్లీ సబ్ రిజిస్ట్రార్ను కలవగా మొత్తం రూ.19,200 ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది. దీంతో హరీశ్ వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి వెంకటేశ్కు డబ్బు ఇస్తుండగా వారు శుక్రవారం వలపన్ని పట్టుకున్నారు. అదనంగా రూ.లక్షా72వేలు దొరకగా అవి ఎవరి నుంచి తీసుకున్నారనే వివరాలు తెలియలేదు. తస్లీమా, వెంకటేశ్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్యామ్సుందర్, సునీల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.