మహబూబాబాద్, అక్టోబర్ 14 : ఈ నెల 16న గ్రూప్-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణ శుక్రవారం ఆయన కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెట్లు, లైజనింగ్, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు, రూట్ ఆఫీసర్లు, అనుబంధ శాఖల జిల్లా స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… టీఎస్పీఎస్సీ మార్గదర్శకాలకు సంబంధించిన చెక్లిస్ట్ను పూర్తిగా అవగాహన చేసుకుని పరీక్షను సజావుగా నిర్వహించాలన్నారు. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. 10.15గంటలలోపు కేంద్రం వద్ద హాల్టికెట్ల వెరిఫికేషన్ చేసేందుకు సహకరించాలన్నారు.
గ్రామాల నుంచి వచ్చే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ సేవలు అందించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మహిళా పోలీసులు తప్పనిసరిగా విధుల్లో ఉండాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాలకు చేరుకునే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రతి పరీక్ష సెంటర్ వద్ద 108 వాహనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ డైరెక్టర్ విల్సన్, ఆర్డీవోలు కొమురయ్య, రమేశ్, జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్, జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్హై, రవాణా శాఖ అధికారి రమేశ్, డీఎస్పీ రేలా జనార్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి, నాగభవాని పాల్గొన్నారు.