తొర్రూరు: వరంగల్ – ఖమ్మం హైవేపై తొర్రూరు మండలం నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. అప్పుడే వరంగల్ వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రమాదాన్ని చూసి అగి మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. పోలీసులతో మాట్లాడి వేగంగా ట్రాఫిక్ నియంత్రణ, పంచనామా, మృతదేహం తరలింపు తదితర అంశాలను అక్కడే ఉండి పర్యవేక్షించారు. పోస్ట్ మార్టం లాంటి వాటిని వేగంగా పూర్తి చేయాలని అదేశించారు. రోడ్డు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను మంత్రి తెలుసుకున్నారు.
రోడ్లపై ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈసందర్భంగా మంత్రి సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. అతి వేగం వద్దు.. వేగం కన్నా ప్రాణం మిన్న, అజాగ్రత్తతో మీవిలువైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోకండి. మీపై ఆధార పడిన మీ కుటుంబాలకు అన్యాయం చేయవద్దని మంత్రి కోరారు.
జనగాం, మహబూబాబాద్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వరంగల్కు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నారి సోమన్న (35), గుడుగుల్ల నరసింహ అనే వ్యక్తులు బైక్పై వెళ్తూ.. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. ఆ తర్వాత కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో సోమన్న అక్కడికక్కడే మృతి చెందగా.. నరసింహ తీవ్రంగా గాయపడ్డాడు. నరసింహను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.