కురవి : మహబూబాబాద్ జిల్లాలోనే అతి పెద్ద దేవాలయం రాష్ట్రంలోనే చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధి పనుల ఆలస్యం గురించి రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకకు ఫోన్లో వివరించారు. గుండ్రాతిమడుగులోని జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి స్వగృహంలో ఆమె కలెక్టర్ శశాంకతో ఫోన్లో మాట్లాడారు. 2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి ఉద్యమ సమయంలో మొక్కిన బంగారుమీసాల మొక్కును తీర్చుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికై నాడు ఐదు కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన నేటికి పనులు పూర్తి కాలేదని కలెక్టర్కు వివరించారు. మహిమాన్వితమైన ఆలయ అభివృద్ధికి పలు రాష్ట్రాల నుంచి విపరీతంగా భక్తులు వస్తారని, మహాశివరాత్రి నుంచి నాలుగు నెలల పాటు జాతర జరుగుతుందన్నారు.
కురవి ఆలయ పరిసరాలలో బ్రిటీష్ కాలంలో కురవిలో నిర్మించిన కైలాస భవనం తొలగించడం జరిగిందని, ఆ స్థలంలో హరిత హోటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.