తొరూరు : ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు ఉంటాయని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మండలంలోని హరిపిరాల గ్రామంలో 45 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆయిల్ఫామ్ నర్సరీని జిల్లా ఉద్యానశాక అధికారి సూర్యనారాయణ, ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్యతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వంట నూనెల ధరలకు రెక్కలు రావడంతో ఆయిల్ఫామ్ సాగు రైతులకు కలిసి వచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టన్ను ఆయిల్ఫామ్ గెలలకు రూ.12800 చొప్పున ధర ఉండడంతో ఈ రైతులకు మంచి లాభాలోస్తున్నాయన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లోనూ పామాయిల్ ధర మండుతున్నందున దాని తయారీకి ఉపయోగించే ఆయిల్ఫామ్ పండ్ల గెలల ధర చుక్కలనంటుతోందని, గతేడాది సరిగ్గా ఇదే సమయంలో ఈ పంట టన్ను ధర రూ. 8386 మాత్రమేనని తెలిపారు. మరోపక్క ఆయిల్ఫామ్ సాగు ప్రాధాన్యాన్ని గుర్తించిన ఉద్యానశాఖ భారీ ఎత్తున ఈ పంటను సాగు చేయించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందన్నారు. రైతులకు 50శాతం సబ్సిడీ ఇచ్చి ఆయిల్ఫామ్ సాగు చేయించనున్నట్లు వెల్లడించారు. నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ఫామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని, జిల్లాలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయం రైతాంగం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో 1200 ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగు చేయనున్నామని తెలిపారు. జిల్లాలోనే తొలి నర్సరీ మండలంలోని హరిపిరాలలో ఏర్పాటు చేశామని, గోపాలగిరిలో ఆయిల్ఫామ్ పరిశ్రమ పనులు సైతం త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. తొరూరులో ఆయిల్ఫామ్ నర్సరీ, పరిశ్రమకు స్థల కేటాయింపులో చొరవ చూపిన తాసిల్దార్ రాఘవరెడ్డి, కంఠాయపాలెంలో ఆదర్శంగా ఆయిల్ఫామ్ సాగు చేస్తున్న ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్యను అభినందించారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ ఏరియా అధికారి సురేశ్, తాసిల్దార్ రాఘవరెడ్డి, ఉద్యానశాఖ అధికారులు రాకేశ్, అరుణ్, రైతులు పాల్గొన్నారు.