మహబూబాబాద్ : ఉపాధిహామీ పనుల్లో ఆడ, మగ తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఐఎంఏ హాల్లో ఈజీఎస్ అధికారులు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధిలేని ప్రతి ఒక్కరికీ జాతీయ ఉపాధి హామీ పనులను కల్పించాలన్నారు. వేతనాల చెల్లింపుల్లో పదిహేను రోజుల కంటే మించకుండా చూడాలన్నారు. కూలీలకు 100రోజుల పనులు కల్పించాలని అధికారులకు సూచించారు.
గ్రూపులు ఏర్పాటు చేసి మేనేజర్లను నియమించి మ్యాపింగ్ ద్వారా పనులు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులకు డిమాండ్ ఉందని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను భలోపేతం చేసేందుకు దోహదపడుతుందన్నారు. గత సంవత్సరంలో లక్ష్యాలను సాధించిన అధికారులందరినీ కలెక్టర్ ప్రశంసించారు. ఉపాధి హామీ పథకంలో పనులన్నీ చేస్తే అంత బడ్జెట్ రాబట్టుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఉపాధిహామీ పనులు ప్రారంభించేందుకు తగిన పమయం ఇదేనని చెప్పారు. కాలువల పూడికతీత, ఫిష్ పాంట్స్, ప్రెంచ్ కటింగ్స్ పనులను చేపటాలన్నారు.
గ్రామస్థాయి పనులకు ముందుగా అనుమతులు పొందాలన్నారు. ఉపాధి హామీ పనులను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిల్లో పర్యటించి మంచి ఆలోచనలతో ఫలితాలు రాబట్టాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్య, ఎంపీడీవోలు, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.