కేసముద్రం, డిసెంబర్ 19: సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. కేసముద్రం మండలం అమినాపురం గ్రామంలో జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 276 గురుకులాలుండగా, రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వాటిని 700లకు పెంచినట్లు తెలిపారు. ఒక్క కేసముద్రం మండలంలోనే 6 గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతో పాటు రుచి, శుచికరమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
గురుకుల పాఠశాలలను ఇంటర్, డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. దేశంలో అత్యధిక గురుకులాలున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, ఇందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, ఒక్కో గ్రామంలో రూ.20లక్షలతో జీపీ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటలు విద్యుత్ సరఫరా లేదని, దేశంలో తెలంగాణలో మాత్రమే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రైతుబంధు నిధులు విడుదలవుతాయని, రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదన్నారు. కల్యాణలక్ష్మి ద్వారా అందిస్తున్న రూ.1,00,116 పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థికంగా భరోసా కలిగిస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వృద్ధులు, దివ్యాంగులు చేనేత, బీడీ కార్మికులు, వితంతువులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి మరో రూ.100 కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ కోరనున్నట్లు తెలిపారు.
పేదల అభివృద్ధికి కృషి.. ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్
సీఎం కేసీఆర్ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. పేదింట్లో ఆడబిడ్డ పెళ్లి జరిగితే రూ.10 సాయం చేయాలనే ఆలోచన గత పాలకులెవ్వరికీ రాలేదని, సీఎం కేసీఆర్ ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.1,00,116 అందించి ఇంటికి పెద్దకొడుకుగా నిలిచాడన్నారు. ఆసరా, కేసీఆర్ కిట్టు వంటి పథకాలు పేదలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు ఇవ్వ డం లేదని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో 175 జీపీ భవనాల నిర్మాణానికి అనుమతులు వచ్చాయన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతూ దేశ సంపదను కొల్లగొడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాట లు నమ్మి మోసపోవద్దని, పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
నాణ్యమైన విద్య, పోషక విలువలున్న ఆహారం అందించేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సత్యనారయణరావు, సర్పంచ్ పురం రాజమణి, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, నాయకులు ప్రవీణ్కుమార్, నజీర్ అహ్మద్, యాకూబ్రెడ్డి, నీలం దుర్గేశ్, రావుల నవీన్రెడ్డి, రావుల రవిచందర్రెడ్డి, యాళ్ల మురళీధర్రెడ్డి, కముటం శ్రీనివాస్, కొండ్రెడ్డి రవీందర్రెడ్డి, ఘనపారపు రమేశ్, దార్ల రామ్మూర్తి, నీలం యాకయ్య, మోడెం రవీందర్గౌడ్, లిం గాల పిచ్చియ్య, కట్టమల్లు, వీరూనాయక్, హరీశ్నాయక్, కృష్ణమూర్తి, శతకోటి నరేశ్ పాల్గొన్నారు.