మహబూబాబాద్, ఆగస్టు 23 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజా పాలనను జీర్ణించుకోలేకనే బీజేపీ నేతలు ఆయన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. దాడి ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ నేతలు కవిత ఇంటిపైకి రావడం దుర్మార్గం, హేయమైన చర్య అన్నారు. దేశంలో బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఆ పార్టీ అరాచకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశంలో దుర్మార్గపు పాలన చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దేశంలో బీజేపీ పాలనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆ నైరాశ్యంలో ఏం పాలుపోక ఈడీ, ఐటీ దాడులకు పూనుకుంటోందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ తప్పుడు కేసులకు ఏ మాత్రం తలవంచదని గుర్తు చేశారు. ఈడీ, ఐటీ అధికారులు బీజేపీ కండువా కప్పుకున్న కార్యకర్తల్లా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. బీజేపీ నాయకులు చిల్లర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత జోలికొస్తే యావత్ తెలంగాణ కన్నెర్ర చేస్తుందని హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని మండిపడ్డారు. అనవసరంగా కేసీఆర్, ఆయన కుటుంబాన్ని లీకుల పేరుతో నిరాధారమైన కేసుల పేరుతో వేధించాలని చూస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు.