కేసముద్రం, ఆగస్టు 2 : సభ్యసమాజం తలదించుకునే ఘటన ఇది. చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్న పచ్చినిజం. వారు ఒక్కతల్లి బిడ్డలైనా వావీవరుసలు మరిచి జంతువుల్లా ప్రవర్తించారు. అత్యంత పవిత్రమైన అన్నా చెల్లెల అనుబంధాన్ని మరిచి కామంతో కళ్లు మూసుకుపోయి సహజీవనానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా తమకు అడ్డుగా ఉందని పేగు బంధాన్ని తెంచుకున్నది తల్లి. కన్న కూతురనే కనికరం లేకుండా అత్యంత కర్కశంగా తోబుట్టువుతో కలిసి గొంతునులిమి చంపింది. సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నంలో గ్రామస్తుల అనుమానంతో హత్య ఉందతం బయటపడి, వారిని కటకటాల పాలుజేసింది. మంగళవారం కేసముద్రం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ ఈ ఘటన వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం..
మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన శిరీషకు 6 సంవత్సరాల క్రితం అదే మండలంలోని కట్టుగూడేనికి చెందిన అశోక్తో వివాహం జరిగింది. వీరికి అనుశ్రీ(6) అనే పాప ఉంది. శిరీష అన్న కుమారస్వామి తరుచూ కట్టుగూడెంలోని ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో వారిద్దరూ వావీవరుసలు మరిచి వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నారు. ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలిసింది. దీంతో 5 సంవత్సరాల క్రితం అనుశ్రీని తీసుకొని శిరీష, కుమారస్వామి ఇంటి నుంచి వెళ్లిపోయారు. భువనగిరి సమీపంలోని ఓ కోళ్లఫాంలో పని చేస్తూ సహజీవనం చేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు జన్మించారు. కాగా, అనుశ్రీకి అప్పుడప్పుడు కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు రావడం, దవాఖానకు తీసుకెళ్లడానికి డబ్బులు ఖర్చవుతున్నాయి. అనుశ్రీ వారికి జన్మించిన పాప కాకపోవడం, దవాఖాన ఖర్చులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. గత నెల 24న ఇద్దరు కలిసి అనుశ్రీ గొంతునుమిలి హత్య చేస్తారు. మృతదేహాన్ని అంబులెన్స్లో నర్సింహులగూడెం గ్రామానికి తీసుకొచ్చి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులకు అనుమానం వచ్చి వెంటనే 100 నంబర్కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా, గొంతు నులమడం ద్వారానే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృత దేహాన్ని తీసుకెళ్లడంతో హత్య విషయం బయటపడుతుందని భావించిన శిరీష, కుమరస్వామి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ నెల ఒకటిన వారిని న భువనగిరిలోని మర్రిగూడెం గ్రామంలో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్య చేసినట్లు అంగీకరించారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు పంపిస్తామని సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్సైలు రమేశ్బాబు, తిరుపతి, ఏఎస్ఐ కృష్ణమూర్తి , పోలీస్ సిబ్బంది ఉన్నారు.