మహబూబాబాద్, ఆగస్టు 2 : ఎస్సై ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 7న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శరత్చంద్రపవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మహబూబాబాద్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, బయోమెట్రిక్, ఇన్విజిలేటర్లకు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 3,458 మంది అభ్యర్థులు ఎస్సై ఉద్యోగాల కోసం పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 9 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటారని, అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి రావాలన్నారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు గోరింటాకు, మెహందీ పెట్టుకోవద్దని, ఎలక్ట్రానిక్ పరికరాలు సెంటర్కు తీసుకురావొద్దన్నా రు. ముఖ్యంగా సెల్ఫోన్లు, రిస్ట్ వాచ్లకు అనుమతి లేదన్నారు. ఈ రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కో-ఆర్డినేటర్ సోష ల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నోడల్ ఆఫీసర్గా అదనపు ఎస్పీ యోగేశ్గౌతమ్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, తొర్రూరు డీఎస్పీలు పంతాటి సదయ్య, రఘు, ఏఆర్ డీఎస్పీ.రేలా జనార్దన్రెడ్డి, మహబూబాబాద్ టౌన్, రూరల్ సీఐలు సతీశ్, రవికుమార్, బయ్యారం సీఐ బాలాజీ, మరిపెడ సీఐ సాగర్, తొర్రూరు సీఐ సతీశ్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాలివే..
1.తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల- మహబూబాబాద్, 2. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల- తొర్రూరు, 3.తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల- ఇనుగుర్తి, 4. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియ ల్ పాఠశాల- నర్సింహులపేట, 5. తెలంగాణ సోషల్ వె ల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల అర్లగడ్డతండా -మరిపెడ, 6. గాదె రుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్ లక్ష్మీటాకీస్ – మ హబూబాబాద్, 7. మహర్షి విద్యాలయం ఈదులపూసపల్లి రోడ్- మహబూబాబాద్, 8. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల అర్లగడ్డతండా- మరిపెడ, 9. ఏకశిల ఏంజిల్స్ శ్రీనగర్ కాలనీ- మహబూబాబాద్.