తొర్రూరు, జూన్ 22: డివిజన్ కేంద్రంలోని సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ప్రవేశాలకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని ఆర్డీవో ఎల్ రమేశ్ సూచించారు. హాస్టల్ ఆవరణలో బుధవారం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ స్థాయి వసతులతో 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ 300 సీట్లను ఈ సమీకృత హాస్టల్లో ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 70 మంది మాత్రమే ప్రవేశాలు పొందినందున మిగిలిన సీట్ల భర్తీకి విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు హాస్టల్ ప్రత్యేకత గురించి వివరించాల్సినవసరం ఉందన్నారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తూ మంచి లైబ్రరీ, వసతులను కల్పించినట్లు చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ హాస్టల్ ఎంతో సౌకర్యం గా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జీకే శ్రీనివాస్, నోడల్ ప్రధానోపాధ్యాయుడు తుమ్మ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచాలి
మహబూబాబాద్ రూరల్ : గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని జిల్లా గిరిజన సంక్షే మ శాఖ డీడీ ఎర్రయ్య సూచించారు. బుధవారం మం డల పరిధిలోని రెడ్యాల గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచుతూ నాణ్యమైన విద్యనందించాలన్నా రు. అనంతరం పాఠశాలలో ఉన్న హాస్టల్ గదులను, వంట గదిని పరిశీలించారు. ఏసీఎం ఈరులాల్, ప్రధానోపాధ్యాయులు వెకంటరెడ్డి, ఉపాధ్యాయులు వెంక న్న, కాంతారావు, మురళి, వ్యాయా మ ఉపాధ్యాయు డు మోహన్, విజయ్, చంద్రమౌళి పాల్గొన్నారు.
నోట్ బుక్కులు అందివ్వడం అభినందనీయం
నెల్లికుదురు: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి ప్లేట్స్, నోట్ బుక్స్, పెన్నులు అందివ్వడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి గుగులోత్ రాము అన్నారు. మండలంలోని నల్లగుట్ట తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ బానోత్ భీముడు నోట్ బుక్, పెన్, పెన్సిళ్లు, తండాకు చెందిన హచ్చునాయక్ మధ్యాహ్న భోజనం చేయడానికి ప్లేట్లను మండల విద్యాశాఖ అధికారి గుగులోత్ రాము చేతుల మీదిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లోనే నాన్యమైన విద్య అందుతుందన్నారు. అనంతరం బడిబాటలో భాగంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ భీముడు, హచ్చునాయక్, పంచాయతీ కార్యదర్శి సునీత, మండల ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ ఎం సుధాకర్, సీఆర్పీ బొడ్డు వీరస్వామి, తండావాసులు పాల్గొన్నారు.