కురవి, జూన్ 19 : ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠాపనమహోత్సవాలకు కురవి గ్రామం సిద్ధమైంది. భద్రకాళీసమేత వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.5కోట్ల మంజూరు చేయగా, పూర్తయిన పనులను ఇటీవల డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు. కాగా, శివాలయంలో ఆంజనేయస్వామి ఆలయం, నవగ్రహ మండపం, నాగుమయ్య ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు ఆలయ చైర్మన్ బాదావత్ రామూనాయక్, ఆలయ ఈవో సత్యనారాయణ ఈనెల 22న వేదపండితులతో సుమూర్తం నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విశాలమైన యాగశాలను నిర్మించారు. 20వ తేదీన గణపతి పూజతో పూజలు ప్రారంభం కానున్నాయి. గోపూజ, భూతబలి, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పంచగవ్య ఆరాధన, అఖండ దీపారాధన, మూలమంత్ర జపములు, సా యంత్రం నిత్యబలిహారణ, 21న మంగళవారం వాస్తుహోమం, వాస్తుబలి, గ్రామ ప్రదక్షిణ, బలిహారణ, సా యంత్రం శాంతిహోమం, 22న ఉదయం యంత్ర విగ్రహ మార్జనలు, పీఠపూజ, ధ్వజస్తంభం, ఆంజనేయస్వామి, నవగ్రహ, నాగబంధన యంత్ర, విగ్రహాల ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వీటితోపాటు గ్రామస్తుల సహకారంతో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సుందరంగా నిర్మించిన రాములవారి ఆల యం కూడా ఈనెల 22న పునఃప్రారంభం కానుంది. దాతల సహకారంతో సీతారామచంద్రస్వామి, అష్టలక్ష్మి, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నట్లు బాధ్యులు తెలిపారు. భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఎమ్మెల్యే రెడ్యాకు ఆహ్వానం
ఈ నెల 20 నుంచి కురవిలో నిర్వహించనున్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి చతుర్ధిక్షు రాజగోపుర, ధ్వజస్తంభ, నవగ్రహ, ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు హాజరుకావాలని స్థానిక నేతలు ఎమ్మెల్యే రెడ్యానాయక్ను ఆహ్వానించారు. ఆదివారం మండలంలోని తన స్వగ్రామం ఉగ్గంపల్లిలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు బజ్జూరి పిచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు తోట లాలయ్య, యూత్ రాష్ట్ర నాయకుడు గుగులోత్ రవి, ఆలయ చైర్మన్ రామూనాయక్, వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ రాజూనాయక్, మాజి ఎంపీపీ రామచంద్రయ్య, సర్పంచ్లు మహేందర్రెడ్డి, రాంలాల్, ఎంపీటీసీ భోజ్యానాయక్, ఆలయ ధర్మకర్త మక్కల వెంకన్న, జలగం వెంకన్న పాల్గొన్నారు.