మహబూబాబాద్ రూరల్, జూన్ 7 : బీజేపీ గద్దెనెక్కి ఎనిమిదేళ్లు దాటినా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసెత్తడం లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంతో కొట్లాడైనా సరే పరిశ్రమను సాధించి తీరతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అధ్యక్షతన పల్లెప్రగతి సభ నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ బిందు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బయ్యారం ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను బయ్యారంలో తిరుగకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మోసపూరిత వాగ్దానాలతో ఓట్లు వేయించుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటైతే యువతకు ఉపాధితోపాటు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ మంచి ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం పల్లెల రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పల్లెప్రగతితో పల్లెల రూపురేఖలు మారాయని తెలిపారు. గ్రామానికో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనంతో పల్లెలు అందంగా మారడమే గాక నిత్యం చేపడుతున్న పారిశుధ్య పనులతో అంటువ్యాధులు దూరమయ్యాయని పేర్కొన్నారు. గతంలో కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తండాలకు అంతర్గత రోడ్లు, మొట్లతిమ్మాపురం, గార్ల మండలం పాకాల ఏరుపై బ్రిడ్జ్ నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసిగా బయ్యారం మండలంలోని తండాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బయ్యారం సమస్యలను స్వయంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోగా, ఆ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పల్లెప్రగతితో పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని, బయ్యారంలో పండుగ వాతావరణంలో మహిళలంతా ఉత్సాహంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. బ య్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం రెండుసార్లు పార్లమెంట్లో నిరసన చేపట్టామని, అయినా కేంద్రప్రభుత్వం మొండి వైఖరి వీడడం లేదన్నారు. కేంద్రం మెడలు వంచైనా ఫ్యాక్టరీ సాధించి తీరుతామన్నారు. సీఎం కేసీఆర్పై నిత్యం ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం జనం రోడ్లపై బారులుతీరే పరిస్థితి ఉండేదని, మిషన్ భగీరథ పథకం పుణ్యమా అని ఆ సమస్య తీరిందన్నారు. జడ్పీచైర్ పర్సన్ బిందు మాట్లాడుతూ పల్లెప్రగతితో బయ్యారంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కార్యక్రమంలో బయ్యారం సర్పంచ్ కోటమ్మ, వైస్ ఎంపీపీ గణేశ్, పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్రెడ్డి, ఎంపీటీసీ శైలజ, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష, ఆర్డీవో కొమురయ్య, డీపీవో సాయిబాబా, పీడీ సన్యాసయ్య పాల్గొన్నారు.
అధికారులను ప్రశ్నిస్తూ.. ప్రజలను పలకరిస్తూ జనంతో ఎర్రబెల్లి సంభాషణ
మహబూబాబాద్ రూరల్ : పల్లె ప్రగతి పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి.. గ్రామంలో అధికారులను ప్రశ్నిస్తూ ప్రజలను పలకరిస్తూ ముందుకుసాగారు. ఈ సందర్భంగా జనంతో మమేకమై గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. ఆ సంభాషణ ఇలా..
మంత్రి : కార్యదర్శి గారు గ్రామంలో ఎన్ని పింఛన్లు వస్తున్నాయి?
కార్యదర్శి : 1100 మందికి వస్తున్నయ్ సార్.
మంత్రి : పింఛన్ వచ్చిన వాళ్లు చేతులు ఎత్తండి.
ప్రజలు : సీఎం కేసీఆర్ సార్ పుణ్యమా అని రూ.2016 వస్తున్నయ్.
మంత్రి : గ్రామంలో వైకుంఠధామం పూర్తిచేశారా?
కార్యదర్శి : పూర్తయింది సార్.
మంత్రి : వెంటనే దానిని వినియోగించుకోండి.
మంత్రి : అవ్వా..! ప్రతిరోజు చెత్త కోసం ఇంటికి ట్రాక్టర్ వస్తున్నదా ?
అవ్వ : రోజూ రావడం లేదయ్యా రోజు విడిచి రోజు వస్తాంది.
మంత్రి : ఎందుకలా.. గ్రామంలో కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది.
కలెక్టర్ గారు రెండో ట్రాక్టర్ కోసం అప్రూవల్ ఇవ్వండి.
మంత్రి : గ్రామంలో రోడ్ల వెంబడి మొక్కలు నాటారా..?
ప్రజలు : అవును నాటారు. మంచిగా పచ్చగా ఉందయ్యా.
మంత్రి : సైడ్ కాల్వలు శుభ్రం చేస్తున్నారు, వ్యాధులు తగ్గినయ్.. శుభ్రంగా ఉన్నాయ్.
దోమల బాధ తప్పింది.. శభాష్ పనులు బాగున్నాయ్.. ఇలా మంచిగ చేసుకోవాలి.