అరవై ఏండ్ల సీమాంధ్రుల దోపిడీ నుంచి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసి బంగారు ఫలాలు అందించేందుకు ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఆవిర్భావ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథం లో పయనిస్తోందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ రైతుకు అండగా నిలుస్తున్నారన్నారు. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మానుకోట జిల్లాలోని పలు మండలాల్లో చెరువులు నిండుకుండలా మారి రెండు పంటలు పండేందుకు అనువుగా మారాయన్నారు. ఇటీవల జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రకటించడంతో ఎంతోమంది వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం కలిగిందన్నారు. జిల్లా మీదుగా ఇప్పటికే రెండు జాతీయ రహదారులు ఉన్నాయని అన్నారు. మరో జాతీయ రహదారి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు పాల్గొన్నారు.