మహిళల స్వయం సమృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లను అందజేస్తూ సామాజికంగా, ఆర్థికంగా మహిళల ప్రయోజనాల కోసం సర్కార్ వివిధ పథకాలను అమలు చేస్తున్నది. ఈ క్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను అందిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలిచేలా ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు వంద శాతానికి మించి రుణ లక్ష్యం చేరుకోవడం విశేషం.
నాగర్కర్నూల్, మార్చి 27 : మహిళల శ్రేయస్సు దిశగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. ఓ మహిళ అభివృద్ధితో కుటుంబం తద్వారా సమాజ పురోగమనం చెందుతుంది. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. అయితే మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా నేరుగా ప్రయోజనం కలగజేయడం జరుగుతున్నది. మహిళా సంఘాల్లోని మహిళలకు రుణాలను అందజేస్తోంది. ఈ రుణాలతో వివిధ రకాలుగా వ్యాపారాలు నిర్వహించుకుంటూ లబ్ధ్దిపొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనికోసం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలను మహిళలకు అందజేస్తున్నది. ఇలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాగర్కర్నూల్ జిల్లాలోనూ రుణాలను అందజేసింది. జిల్లాలోని 20మండలాల పరిధిలో 6,527స్వయం సహాయక సంఘాలున్నాయి. ఈ సంఘాలకు ప్రభుత్వం నుంచి రూ.305.55కోట్ల రుణాలను అందించేందుకు డీఆర్డీఏ అధికారులకు లక్ష్యం నిర్దేశించింది. దీంతో అధికారులు మహిళా సంఘాలకు ఈ సంవత్సరంలో 101శాతంతో రూ.308.08కోట్లను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలోనూ ఇలా వంద శాతం లక్ష్యం సాధించిన తొలి జిల్లాగా నాగర్కర్నూల్కు నిలవడం గమనార్హం. ఇక మహిళా సంఘాల రుణాల రికవరీ శాతం కూడా 99శాతంగా ఉండటం విశేషం. తీసుకున్న రుణాలను సైతం మహిళలు సకాలంలో చెల్లిస్తున్నారు. ఒక్కో సంఘానికి గరిష్టంగా రూ.20లక్షల వరకు మంజూరు చేయడం జరిగింది. డీఆర్డీఏ అధికారుల కృషి కూడా తోడు కావడంతో రుణాల పంపిణీ, రికవరీలు కూడా వంద శాతంలో ఉంటున్నాయి. మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకున్న మహిళలు కిరాణా, చికెన్ సెంటర్లు, బట్టల షాపులులాంటి పలు వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఉపాధి పొందేందుకు దోహదపడనుంది. దీంతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ డీఆర్డీఏ పీడీ, ఏపీడీలను అభినందించారు. జిల్లాలోని బ్యాంకర్లు కూడా సకాలంలో రుణాలు అందించేలా కలెక్టర్, డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకొన్నారు. జిల్లాలో మండలాల వారీగా చూస్తే పెంట్లవెల్లిలో అత్యధికంగా రూ.7.09కోట్లకు గాను 173శాతంతో రూ.12.27 కోట్లు, తిమ్మాజిపేటలో రూ.10.58కోట్లకుగానూ 131శాతంతో రూ.13.90 కోట్లు, అత్యల్పంగా ఊర్కొండలో రూ.9.99కోట్లకుగానూ 79శాతంతో రూ.7.92కోట్లు, వంగూరులో రూ.16.79కోట్లకుగానూ 13.91శాతంతో రూ.82.86కోట్ల మేర రుణాలు పంపిణీ చేశారు. 20మండలాలకుగానూ 14మండలాల్లో వందశాతం రుణాలు పంపిణీ చేశారు. మిగిలిన ఏడు మండలాలకు ఈనెలాఖరులోగా వందశాతం లక్ష్యం చేరేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అయితే జిల్లా లక్ష్యం రూ.312కోట్లకుగానూ రూ.308కోట్లు దాటింది. మొత్తం మీద మహిళా సంఘాలకు వందశాతం రుణాల పంపిణీ జరగడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, డీఆర్డీఏ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
జిల్లాలో 102శాతం రుణాల పంపిణీ
జిల్లాలో రూ.305కోట్ల రుణాల పంపిణీ లక్ష్యానికి గానూ 6521మహిళా సంఘాలకు రూ.312కోట్ల రుణాలను అందజేశాం. 14మండలాల్లో వంద శాతం రుణాలు పూర్తయ్యాయి. మరో 6మండలాలు ఈనెలాఖరుకు పూర్తవుతుంది. జిల్లా కలెక్టర్, డీఆర్డిఏ పీడీ, మహిళా సంఘాల సహకారంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేశాం. మహిళలు తీసుకున్న రుణాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతం చెల్లించాలి.