మహబూబాబాద్ : జిల్లాలో పాఠశాలలు, కాలేజీల వద్ద ఆకతాయిల అల్లర్లపై షీ టీం బృందాలకు విద్యార్థినీలు సమాచారం అందించాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయిదత్తా ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలతో షీటీం బృందం సభ్యులు షీటీం సేవలు, సమాచారం అందించాల్సిన విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్యూఆర్ కోడ్ ఉన్న పోస్టర్ను ఆవిష్కరించి స్కానింగ్ చేస్తే సమాచారం ఏ విధంగా ఇవ్వాలో విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా షీటీం సభ్యులు మాట్లాడుతూ ఏ కాలేజీలోనైనా విద్యనభ్యసించే విద్యార్థినులు షీటీం సేవల కోసం విడుదల చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఘటనకు సంబందించిన అన్ని రకాల వివరాలు షీటీం వారికి సమాచారం ద్వారా తెలుస్తోందని చెప్పారు.
తద్వారా షీటీం బృంధం సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆకతాయిల చేష్టలపై నిఘా ఉంచుతారన్నారు. వారిని ఇట్టే పట్టుకుని కౌన్సిలింగ్ ఇస్తారని అన్నారు. కౌన్సిలింగ్కు సహకరించని వారి తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకొచ్చి వారి కుమారుడు చేస్తున్న ఆకతాయి పనులను వివరించడం జరుగుతుందన్నారు. అవసరమైతే ఆకతాయిలతో పాటు వారి తల్లిదండ్రలపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వాట్సాప్ నంబర్ 7901142009కు సైతం సమాచారం అందించవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
క్యూఆర్ కోడ్ ఉన్న పోస్టర్లను జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ల సమీప ప్రాంతం, సినిమా హాల్స్, స్కూల్స్, కళాశాలల వద్ద ఉన్న గోడలపై అతికిస్తున్నామని తెలిపారు. అవసరమైతే అన్ని వేళల్లో అందుబాటులో ఉండే డయల్ 100కు సమాచారం ఇచ్చిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడం జరగుతుందన్నారు.