ఛాతిలో బుల్లెట్ దిగి విలవిల
గాంధీ వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్కం వినయ్
బాధితుడిది గార్ల మండలం మద్దివంచ
గార్ల, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంపతుల రెండో కొడుకు వినయ్ ఇంటర్ చదివాడు. ఆర్మీ ఉద్యోగం కోసం నెల రోజులపాటు హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నాడు.
పోలీసులు కాల్పులు జరపడంతో వినయ్ ఛాతిలో బుల్లెట్ దిగింది. దీంతో అతడిని హైదరాబాద్లోని గాంధీ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వినయ్కి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ హుటాహుటిన గాంధీ వైద్యశాలకు వెళ్లారు. కాగా అక్కడి వైద్యులతో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్ ఫోన్లో మాట్లాడారు. వినయ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పగా కోలుకునేదాకా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.