నర్సంపేటరూరల్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలోని అన్ని వర్గాల కార్మికుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని బీఆర్టీయూ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ నర్సంపేట పట్టణంలో మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిత్రపటానికి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (బీఆర్టీయూ అనుబంధ కమిటీ) ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 54 వేల పైచిలుకు కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. వీరందరికీ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 8ని విడుదల చేసిందన్నారు. మధ్యాహ్న భోజన పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో నడుస్తున్నదని గుర్తుచేశారు. ఇందులో కార్మికులకిచ్చే వేతనాల్లో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్ర వాటా 40 శాతం ఉన్నదని వెల్లడించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వమే మెజార్టీ వాటా భరిస్తున్నదన్నారు. రూ. 3 వేల వేతనంలో రూ. 600 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని, దీన్ని 60 శాతానికి పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు ఇమ్మడి పద్మ, నాయకులు రాపాక మాణిక్యం, కొత్త పద్మ, నాగిశెట్టి స్వరూప, తడుగుల ఏలిషా, గాండ్ల పూలమ్మ, ఆకుల సరోజన, భాగ్యలక్ష్మి, శ్రీదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు.