జనగామ, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ ఉద్యమాలను గ్రంథాలయాల్లోని పుస్తకాల ద్వారా అధ్యయనం చేసిన సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్వహించి రాష్ర్టాన్ని సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, డీసీపీ సీతారాం, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు ఏడవెల్లి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునతో కలిసి జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు.
గ్రంథాలను రచించడం ద్వారానే బమ్మెర పోతన, కాళోజీ సోదరులు మహాకవులుగా, సాహితీవేత్తలుగా ఎదిగారని తెలిపారు. పుస్తకాలు, గ్రంథాలు, పత్రికలంటే సీఎం కేసీఆర్కు ఎంతో ఇష్టమన్నారు. అందుకే రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. గురువులు, తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలంటే విద్యార్ధులు, యువత సెల్ఫోన్ల కంటే పుస్తక పఠనం అలవర్చుకుని ఉన్నతంగా రాణించి సమాజానికి సేవలందించాలని కోరారు. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుందని, ఇందుకోసం యువత గ్రంథాలయాలను అధ్యయనం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రతి మం డల కేంద్రంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఎర్రబెల్లి వెల్లడించారు. అందరూ కలిసికట్టుగా మన గ్రంథాలయాలను కాపాడుకుందామని, ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుం చి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలన్నారు. కరోనాతో రెండేళ్లుగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల పుస్తకాలు అందించాలనే లక్ష్యంతోనే 1919లో అఖిల భారత ప్రజా గ్రంథాలయ అసోసియేషన్ను స్థాపిస్తే కాలక్రమేణా ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ గా మారిందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే జిల్లాల్లో గ్రంథాలయాలకు కొత్త భవనాలను నిర్మిస్తున్నామని, నూతన కమిటీలు వేశామని తెలిపారు.
కంప్యూటర్ యుగంలోనూ పుస్తక పఠనం
కంప్యూటర్లు వచ్చినా పుస్తక పఠనంపై యువత ఆసక్తి చూపుతున్నారని, గ్రంథాలయాల ప్రత్యేకత కాదనలేదనిదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పుస్తక పఠనం జీవితాన్ని మారుస్తుందని ఆయన పేర్కొ న్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వినతి మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు వేల గజాల్లో నిర్మించే జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో ఇప్పటికే ఎనిమిది మండలాల్లో గ్రంథాలయాలకు భవనాలున్నాయి, మిగిలిన నాలుగు మండలాల్లో 500 గజాల చొప్పున స్థలాన్ని కేటాయిస్తే నిధులు మంజూరు చేయిస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్లు దామెర రవి, యాదగిరి, కౌన్సిలర్లు బండ పద్మ, మారబోయిన పాండు, వంగాల కళ్యాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు పసుల ఏబెల్, బండ యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.